గుంటూర్లో భూప్రకంపనలు: భయంతో జనం పరుగులు
కృష్ణా పరివాహక ప్రాంతంలో గత రెండు మూడు నెలలుగా భూమి స్వల్పంగా కంపిస్తోంది. ఇప్పటి వరకు పల్నాడు ప్రాంతంలో భూమి కంపించింది. శావల్యాపురం మండలంలో ఇది మొదటిసారి. రెండు నెలలుగా కృష్ణా పరివాహక ప్రాంతంలో భూమి కంపించడం ఇది మొత్తంగా మూడోసారి. అయితే అధికారులు మాత్రం మళ్లీ ప్రకంపంలు వచ్చే పరిస్థితి లేదని ప్రజలకు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
గత అక్టోబరులో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భూప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 3 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, కృష్ణా, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు సమాచారం అందింది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ భూమి ప్రకంపనలు సంభవించాయి.
అందిన సమాచారం ప్రకారం - నల్లగొండ జిల్లాలోని మిర్యాలగుడా, మేళ్లచెర్వు, దామచర్ల, హాలియా, మఠంపల్లి మండలాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పది మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోని వినుకొండ, పిడుగురాళ్ల, కారంపూడి, గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, అద్దంకి, దర్శి, మార్టూరు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
జిల్లాలోని మూడు శాసనసభా నియోజకవర్గాల్లో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, ముక్యాల, వేదాద్రి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాను కూడా ప్రకంపనలు తాకాయి. ఈ జిల్లాలోని హయత్నగర్, కొత్తగూడెం మండలాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నల్లగొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గోడలకు బీటలు వారినట్లు తెలుస్తోంది. సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూప్రంకపనలు చోటు చేసుకున్నాయి.