ఆఫ్టర్ 71డేస్: మోపిదేవి వెనుక జగన్, చెరగని నవ్వు
జగన్ ఆస్తుల కేసు, ఓఎంసి కేసు, ఎమ్మార్ కేసు నిందితులందరికీ కోర్టు రిమాండును ఈ నెల 19వ తేది వరకు పొడిగించింది. జగన్ అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్తో పాటునిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి, ఓఎంసి కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, రాజగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిల రిమాండు నేటితో ముగిసింది.
ప్రత్యేక కోర్టు జడ్జి సెలవుల్లో ఉన్నందున వీడియో కాన్ఫరెన్సు విచారణకు అవకాశం లేకపోవడంతో వారిని కోర్టుకు తరలించాలని నిర్ణయించుకున్నారు. జగన్ తరలింపు నేపథ్యంలో చంచల్గూడ జైలు నుండి గగన్ విహార్ కోర్టు వరకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్ వాహనం వెళ్లే రహదారి మొత్తం పోలీసులతో నిండిపోయింది. సిబిఐ కోర్టు వద్ద, చంచల్గూడ జైలు వద్ద కూడా బందోబస్తును పెంచారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, ప్రత్యేక బలగాలను మోహరించారు.
జగన్ను ప్రత్యేక వాహనంలో గగన్ విహార్ కోర్టుకు తరలించారు. ఎంపి, ఓ పార్టీ అధినేత కావడంతో ప్రత్యేక బలగాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. 71 రోజుల తర్వాత జగన్ జైలు నుండి కోర్టుకు హాజరయ్యారు. జగన్ను చూసేందుకు చంచల్గూడ జైలు వద్ద, సిబిఐ కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చంచల్గూడ వద్ద కార్యకర్తలు హంగామా సృష్టించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సిబిఐ కోర్టు వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రెహ్మాన్ అరెస్టయ్యారు.
జగన్ సతీమణి భారతి రెడ్డి, ఆడిటర్ విజయ సాయి రెడ్డి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. జగన్ కంటే ముందే శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్, రాజగోపాల్, సునీల్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను సిబిఐ కోర్టుకు తరలించారు. గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణను జగన్ కంటే ముందు జైలుకు తరలించారు. మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా కోర్టుకు హాజరయ్యారు. మోపిదేవి అయ్యప్ప దీక్షలో ఉన్నారు.