ఖైదీలకు పని: ఔషధ మొక్కలతో జైళ్లు హరితం
హిమాలయ కంపెనీతో కుదుర్చుకున్న అవగాహనా పత్రంపై అప్పటి జైళ్ల డైరెక్టర్ జనరల్, ప్రస్తుత హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టిపి దాస్ ఈ ఏడాది జులైలో సంతకం చేశారు. హెర్బల్ హెల్త్కేర్ కంపెనీ సహకారంతో అనంతపురంలోని ఓపెన్ జైలులో ఆగస్టులో ఔషధ మొక్కల సాగు ప్రారంభమైందని, జైలు సూపరింటిండెంట్ ఎస్ లక్ష్మీపతి ఓ వార్తా సంస్థ ప్రతినిధితో చెప్పారు.
ప్రస్తుతం రెండు ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైందని, తర్వాత మరో నాలుగు ఎకరాలను కూడా సాగులోకి తెచ్చామని, మొత్తం ఆరు ఎకరాల్లో ఔషధ మొక్కల పెంపకం జరుగుతోందని చెప్పారు. ఔషధ మొక్కల పెంపకానికి నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను జైలు అధికారులు సమకూరుస్తుండగా, డ్రగ్ కంపెనీ విత్తనాలు సరఫరా చేస్తోంది.
డ్రగ్ కంపెనీ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తోందని లక్షీపతి చెప్పారు. ఖైదీలు ఆల్ఫాఆల్ఫాను వేశారని, ఇది ఏ సీజన్లోనైనా పెంచవచ్చునని, స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ దిగుబడి వస్తుందని ప్రాజెక్టు ఇంచార్జీ, జైలర్ వెంకటేశ్వర రావు చెప్పారు. ఇది ఏడాదికి ఎనిమిది సార్లు దిగుబడి సాధిస్తుందని అన్నారు. మొదటి పంటను హిమాలయ కంపెనీ కొనుగోలు చేసిందని, రెండో పంట కోయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.