చల్లబడ్డ కావూరి, టి-ఎంపీలు: షాకిచ్చిన జగన్ పార్టీ
అయితే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం కావూరికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. తనకు ప్రధానమంత్రి ఫోన్ చేశారని, ఎఫ్డిఐలకు అనుకూలంగా ఓటు వేయమని కోరారని కావూరి చెప్పారు.
అయితే ఇప్పటి వరకు తన నిర్ణయంలో మార్పు లేదని, ఓటింగుకు హాజరుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే గతంలో సమావేశాలకు హాజరయ్యే ప్రసక్తే లేదని చెప్పిన కావూరి ఇప్పుడు ఓటింగుకు హాజరుపై నిర్ణయం తీసుకోలేదన్నారు. సభకు హాజరయ్యే విషయంపై ఆయన పునరాలోచిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
జైపాల్ ఇంట్లో టి-ఎంపీలు
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా ఓటింగ్కు హాజరయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తప్ప తాము ఓటింగుకు హాజరు కామని నిన్న పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పిన ఎంపీలు ఈ రోజు చల్లబడ్డట్లుగా కనిపిస్తోంది.
వారు ఉదయం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఓటింగుకు హాజరు కావాలా లేదా అనే అంశంపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపి గుత్తా మాట్లాడుతూ తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం లేదని, కేవలం తెలంగాణ కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఇటు కావూరి, అటు తెలంగాణ ఎంపీల తీరును చూస్తుంటే వారు ఓటింగులో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్పీ, బిఎస్పీ హ్యాండ్ ఇవ్వడంతో కాంగ్రెసు ఎఫ్డిఐ ఓటింగుకు మెజార్టీని కూడగట్టే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తోంది. దాదాపు 500 మంది ఎంపీలు ఓటింగులో పాల్గొనే అవకాశముంది.
ఎస్పీ, బిఎస్పీలు గైర్హాజరు కానున్నాయి. డిఎంకె ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ యూపిఏకు మద్దతు పలకనుంది. 218 మంది ఎంపీలు ఎఫ్డిఐకి వ్యతిరేకంగా ఉన్నారు. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చివరి నిమిషంలో ఎఫ్డిఐలపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారు ఈ అంశంపై పెదవి విప్పక పోవడంతో విమర్శలు ఎదుర్కొన్నారు.
తాజాగా ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ తాము ఎఫ్డిఐలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించాడు. నేటి వరకు నిర్ణయం తీసుకోక పోవడంతో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర పార్టీలు ఎఫ్డిఐపై జగన్ పార్టీని దోషిగా చూపే ప్రయత్నాలు చేశాయి.