ప్రియుడితో కలిసి అత్తను చంపిన మహిళ అరెస్టు
వరంగల్ జిల్లా కాజీపేటలోని ప్రశాంత్నగర్కు చెందిన వన్నాల స్వర్ణ (55) నర్సంపేటలోని అటవీశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తోంది. ఆమె భర్త మృతి చెందాడు. పెద్ద కుమారుడు సతీష్ ఆస్ట్రేలియాలో వుంటుండగా అతడి భార్య సౌజన్య కాజీపేటలోనే అత్త స్వర్ణ వద్ద ఉంటోంది.
వివరాలు ఇలా ఉన్నాయి - గత అక్టోబర్ 12వ తేదీన రాత్రి స్వర్ణ అకస్మాత్తుగా మృతి చెందింది. మర్నాడు ఉదయం స్వర్ణ గుండెపోటుతో మరణించిందని అనుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు కుమారులు వచ్చేదాక మృతదేహాన్ని భద్రపరిచి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పెద్ద కుమారుడు సతీష్ తన తల్లిపేరున బ్యాంకులో ఉన్న ఖాతాను రద్దు చేయడానికి కలెక్టరేట్లోని ఆంధ్రాబ్యాంక్కు వెళ్లగా స్వర్ణ మృతి చెందిన తర్వాత మూడు సార్లు ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా అయినట్లు తేలింది.
తర్వాత సౌజన్యకు అనారోగ్యంగా ఉందని సతీష్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. ఆమె 7 నుంచి 8 వారాల గర్భవతి అని వైద్యపరీక్షల్లో తేలింది. తాను నాలుగు వారాల క్రితం ఆస్ట్రేలియా నుంచి ఇంటికి రాగా తన భార్య 8 వారాల గర్భం దాల్చడమేంటని సతీష్ ఖంగుతిన్నాడు. భార్యపై సందేహంతో సతీష్ కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు కాజీపేట సీఐ జబ్బార్ నవంబర్ 19న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సౌజన్య సెల్ఫోన్ కాల్ డిటేయిల్స్ తీసి పరిశీలించగా ఒక సెల్నుంచి తరచూ వందల సంఖ్యలో మెస్సేజీలు, కాల్స్ రావడం పోలీసులు గమనించారు. సెల్ఫోన్ వినియోగదారుడు కరీంనగర్ జిల్లా ముత్తారానికి చెందిన దేవునూరి నరేశ్గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు నరేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య విషయం బయటకు వచ్చింది. గత ఏప్రిల్ నెలలో సౌజన్యకు సెల్ఫోన్ ద్వారా నరేశ్తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ చదువుతున్న నరేశ్ తరచూ సౌజన్య వద్దకు వచ్చేవాడు. సౌజన్య వద్ద తరుచుగా డబ్బులు తీసుకునేవాడు.
దాంతో సౌజన్య అత్తగారి ఖాతాలోంచి డబ్బులు కాజేయాలనే ఆలోచన పుట్టింది. తన ఆలోచనను మిత్రులైన నరేశ్, క్రాంతి లకు చెప్పాడు. గత అక్టోబర్ 12 తేదీ రాత్రి 11 గంటలకు ఇంటిలోకి ప్రవేశించిన ముగ్గురు సుమారు ఒంటిగంట సమయంలో స్వర్ణ ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కి హత్య చేశారు.
మృతురాలికి చెందిన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను, రెండు ఏటీఎం కార్డులను తీసుకెళ్లారు. మూడు సార్లు ఏటీఎం నుంచి రూ. 65వేలు డ్రా చేసి ముగ్గురూ పంచుకున్నారు. హంతకుల కోసం వెదుకుతున్న కాజీపేట సీఐ జబ్బార్ మంగళవారం ఉదయం సౌజన్యను, నరేశ్ అరెస్టు చేశారు. హత్యలో భాగస్వాములు అయిన కిరణ్, క్రాంతి ఇద్దరు పరారీలో ఉన్నారు.