జగన్ బయటకు రాడు, అవిశ్వాసం పెట్టరు: బాబు
మాటల గారడీ చేసి మభ్యపెట్టడం తప్ప, ప్రజల కోసం కెసిఆర్ ఏనాడూ పోరాటం చేయలేదని ఆయన అన్నారు. బుధవారంనాడు సాటాపూర్ నుంచి ప్రారంభమైన బాబు యాత్ర తాడ్బిలోలి, బొర్గాం మీదుగా ఫకీరాబాద్ వరకు 12 కిలోమీటర్ల మేర కొనసాగింది. చంద్రబాబు పాదయాత్ర గురువారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం మీదుగా పాదయాత్ర బుధవారం రాత్రి బాసరకు చేరుకుంది. గురువారం నుంచి ఈనెల 13 వరకు 8 రోజుల్లో మూడు నియోజకవర్గాల మీదుగా 124 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. రోజూ 13-17 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని చంద్రబాబు తన నిజామాబాద్ పాదయాత్రలో వ్యాఖ్యానించారు. కెసిఆర్ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిందన్నారు. వెయ్యిలారీల వంద రూపాయల నోట్ల కట్టలను వైయస్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ దేనికైనా సిద్ధపడుతున్నాడని, ఇది సిగ్గు పడాల్సిన విషయమన్నారు.
కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కయిందని విమర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు అసెంబ్లీలో సబ్ప్లాన్ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ జైలు నుంచి వచ్చాక ప్రభుత్వాన్ని పడగొడతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పడం వారి దివాళాకోరుతనాన్ని బయటపెడుతోందన్నారు.
జగన్ జైలు నుంచి రాడని, వీళ్లు అవిశ్వాసం పెట్టరని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా కాంగ్రెస్పై రాజీలేని పోరాటం చేస్తున్నది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, నిప్పులాంటి తనను తప్పుడు మనుషులు ఏమీ చేయలేరని ప్రకటించారు.