వాకింగ్పైనే మక్కువ: చంద్రబాబుపై కిరణ్ విసుర్లు
ప్రతిపక్షాలు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, అభివృద్ధిలో మాత్రం కలిసి రావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పాడి ఉత్పత్తి భారీగా పెరిగిందని దీనికి తోడు ప్రైవేటు డెయిరీల వారంతా ఏకమై పాల ధరలను తగ్గించడంతో రైతులకు ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. పాడి రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.
వెయ్యి జనాభా ఉన్న తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీస్తామని చెప్పారు. మహిళలు ప్రభుత్వ పథకాల ఆసరాతో మరింత ఆర్ధికాభివృద్ధి సాధించాలని చెప్పారు. ఆడపిల్లల విషయంలో వివక్షను తొలగించాలని స్వయం సహాయక సంఘాల మహిళలకు సూచించారు. రాజీవ్ యువకిరణాలపై మొదట్లో విమర్శలు వచ్చినా ఫలితాలు చూసిన తర్వాత అందరికీ అర్థమైందని, ఈ పథకం ద్వారా ఏడాదికి 6 లక్షల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
తన నియోజకవర్గానికి నిధులు కేటాయించనందుకు నిరసనగా సీఎం ఇందిరమ్మబాటలో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన చేవెళ్ల టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం కూడా ముఖ్యమంత్రితో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు
ఇందిరమ్మ బాట ముగింపు సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించి, ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వెళ్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్ఠానం ఉంటుందని, వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన జవాబిచ్చారు. అలాగే, కేటాయింపు పొంది పనులు ప్రారంభించని సెజ్లను రద్దుచేయడం నిరంతర ప్రక్రియ అని, ఇప్పటికే కొందరికి నోటీసులు ఇచ్చి రద్దు చేశామని, ఇంకా ఇలాంటివి ఉంటే వాటినీ రద్దుచేస్తామని తెలిపారు.
ఎఫ్డీఐలతో ప్రజలకు మేలే జరుగుతుందని, హైదరాబాద్, విశాఖలకు వీటివల్ల రూ. 500 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు. యువ కిరణాలు పథకంలో లక్షలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఉద్యోగ జాతర పథకం కింద వచ్చే ఏడాది మరో 6లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.