ఒత్తిడిలో బాబు: తప్పు చేస్తే శిక్ష తప్పదని వ్యాఖ్య

ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఆర్లి క్రాస్ రోడ్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కుంటాల క్రాస్ రోడ్, నందన్ క్రాస్రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలోమీటర్లు నడిచి 1100 కిలోమీటర్లు పూర్తి చేశారు. రాజ్యసభలో ఓటింగ్ జరిగిన సమయంలో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు హాజరు కాలేకపోయారని, తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇప్పటికే 1100 కిలోమీటర్లకు పైగా నడిచానని, ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం తనకు తీవ్రమైన బాధ కలిగించిందని ఆయన అన్నారు.
అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని దేవేందర్ గౌడ్ ముందే చెప్పారని, మిగతా ఇద్దరూ (సుజనా చౌదరి, గుండు సుధారాణి) లిఖితపూర్వకంగా జరిగినదాన్ని తనకు వివరించారని, తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని, తనకూ, పార్టీ కార్యకర్తలకూ క్షమాపణ చెప్పారని ఆయన అన్నారు. తాను ఈ విషయాన్ని పరిశీలిస్తున్నానని, ప్రలోభాలకు లోనయినట్టు తేలితే ఎవరినైనా క్షమించేది లేదనిస అదే సమయంలో తెలియక పొరపాటు జరిగి ఉంటే శిక్షించడం కూడా సరికాదని ఆయన అన్నారు.
ఒక ఎంపియో ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదని, విలువలతో కూడిన రాజకీయం చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎదురు పార్టీలపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రాన్ని దోచుకున్న వారూ మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారని, జైల్లోఉండి కూడా ప్రణబ్కు ఓటు వేశారనిస ఇప్పుడు ఎఫ్డీఐలపై గైర్హాజరయ్యారని, ఆ పార్టీ వాడినని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ (సబ్బం హరి) కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేశారని ఆయన వైయస్సార్ కాంగ్రెసుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుందనిస ఇలాంటి వాళ్లా మా గురించి మాట్లాడేదని ఆయన అన్నారు.
ఎన్టీఆర్ గానీ తాను గానీ నిప్పులా బతికామని, అందుకే ఎవరూ ఏమీ చేయలేకపోయారని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పుట్టుకే అవినీతి పుట్టుక అని, అది రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఏర్పటైన పార్టీ అని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన తీవ్రం ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలయ్యారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications