ఆప్ టూ బీజేపీ: రాఘవ్ చద్దా రూటు మార్చడానికి కారణం ప్రియాంక చోప్రానేనా ???
ప్రస్తుతం భారత రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత రాఘవ్ చద్దా బీజేపీలో చేరిక. ఆప్ కీలక నేతగా పేరున్న రాఘవ్, అనూహ్యంగా కాషాయ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఈ నిర్ణయం వెనుక కారణాలపై పలు ఊహాగానాలు చెలరేగుతుండగా, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఓ పాడ్కాస్ట్లో నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన విషయాలు వెల్లడించారు. రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రానే ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. "రాఘవ్ చద్దా తన సోదరి పరిణీతి చోప్రా భర్త కావడంతో ఆయనను కాపాడుకోవడానికి ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నారు" అని కౌర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ వెనుక పడ్డారని, త్వరలోనే ఆయనపై ఈడీ (ED) దాడులు జరిగే అవకాశం ఉందని ప్రియాంకకు ముందే సమాచారం అందిందని ఆమె వెల్లడించారు. అందుకే తన చెల్లెలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాఘవ్ను బీజేపీ వైపు మళ్లించారని కౌర్ పేర్కొన్నారు.

అంతేకాకుండా, రాఘవ్ చద్దాకు ఆప్ అధిష్టానానికి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని నవజ్యోత్ కౌర్ సిద్ధూ వివరించారు. పార్టీ కోసం రాఘవ్ సరిగా మాట్లాడటం లేదని ఆప్ నాయకత్వం భావించిందని, ఆ కారణంగానే వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. ఏదైనా తప్పు జరిగినప్పుడు అప్పుడే గళం విప్పాలని, నాలుగేళ్ల తర్వాత మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ రాజకీయ మార్పు రాఘవ్ చద్దా సోషల్ మీడియా ఇమేజ్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బీజేపీలో చేరిన మరుసటి రోజే ఆయన ఇన్స్టాగ్రామ్లో 20 లక్షలకు పైగా (రెండు మిలియన్లు) ఫాలోవర్లను కోల్పోయారు. సినీ ప్రముఖులు కునికా సదానంద్, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా రాఘవ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన ఈ కీలక వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా లేదా రాఘవ్ చద్దా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఈ నిర్ణయం వెనుక నిజంగా ఇదే కథ ఉందా అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. రాఘవ్ చద్దా రాకతో బీజేపీ బలం పెరుగుతుందా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింటుందా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications