కిరణ్ అవసరంలేదు: వివేక్, మంచిదికాదు.. రాయపాటి
ఈ నెల 28నే అఖిలపక్షాన్ని నిర్వహించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వస్తుందని పార్టీ సీనియర్ నేత హనుమంత రావు వేరుగా అన్నారు. ఇప్పటికే తెలంగాణ పట్ల కేంద్రం కంటి తుడుపు చర్యలు చేపడుతోందని, కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తోందని విమర్శలు వస్తున్నాయని, ఇప్పుడు అఖిలపక్షాన్ని వాయిదా వేస్తే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సిఎం వచ్చేందుకు అంత ఇబ్బందిగా ఉంటే ప్రపంచ తెలుగు మహాసభలనే వాయిదా వేసుకోవాలన్నారు.
కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని పార్టీలన్నీ ఒక్కొక్క ప్రతినిధినే పంపించాలని విహెచ్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు హాజరైతే మరింత బాగుంటుందన్నారు. అన్ని పార్టీల వైఖరులను తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ కూడా తన వైఖరిని వెల్లడించాల్సి వస్తుందని చెప్పారు. పార్టీ నుంచి వలసలపై ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణల వ్యాఖ్యలు సరికావన్నారు. ఎవరున్నా లేకున్నా పార్టీ ఎక్కడకుపోదని అయితే వలసలను ఆపాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని సంక్రాంతి పండుగ తర్వాత నిర్వహించాలని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు డిమాండ్ చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం సమావేశాలు జరపడం మంచిది కాదన్నారు.