మే 1 నుంచి సిగరెట్ ధరల మోత.. ఎంత పెరగనుందంటే?
మే 1 నుంచి సిగరెట్ల ధరలు ఏకంగా 17 శాతం మేర పెరగనున్నాయనే ప్రకటనతో స్టాక్ మార్కెట్లో పొగాకు కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయి. మధ్యాహ్నం 1:10 గంటల సమయానికి ఐటీసీ (ITC) షేర్లు 4 శాతం లాభపడగా, గాడ్ఫ్రే ఫిలిప్స్ (Godfrey Phillips) షేర్లు ఏకంగా 6.5 శాతం పుంజుకున్నాయి. సిగరెట్ల ధరల పెంపు వల్ల కంపెనీల లాభాలు పెరుగుతాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీ కూడా 2 శాతం మేర ఎగబాకింది.
ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. ఈ ధరల పెంపు కేవలం ప్రీమియం ఉత్పత్తులకే పరిమితం కాకుండా, సామాన్యులు వాడే తక్కువ ధర కలిగిన వాల్యూ-ఎండ్ బ్రాండ్లకు కూడా వర్తించనుంది. డిస్ట్రిబ్యూటర్ల నుంచి అందిన సమాచారం మేరకు.. ప్రస్తుతం రూ.115 ఉన్న ఐటీసీ గోల్డ్ఫ్లేక్ ప్రీమియం ప్యాక్ ధర మే నెల నుంచి రూ.135 కి చేరే అవకాశం ఉంది. అంటే సగటున ప్రతి సిగరెట్పై రూ.2 నుంచి రూ.3 వరకు భారం పెరగనుంది. కింగ్ సైజ్ సిగరెట్లపై ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుంది.

ధరలు పెరగడానికి కారణమేంటి?
ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్ ఆమోదించిన 'సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025' ఈ పెంపునకు ప్రధాన కారణం. దీని ప్రకారం పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం భారీగా ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ప్రతి 1,000 సిగరెట్లపై వాటి పొడవును బట్టి రూ.2,050 నుంచి రూ.8,500 వరకు ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఈ ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా మరో 40 శాతం జీఎస్టీ కూడా అమల్లో ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచే ఈ సుంకాలు అమల్లోకి వచ్చినప్పటికీ, కంపెనీలు ఇప్పుడు ఆ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించడానికి సిద్ధమయ్యాయి.
విశ్లేషకుల అభిప్రాయం
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం.. 75 మి.మీ కంటే ఎక్కువ పొడవు ఉన్న సిగరెట్లు ఐటీసీ మొత్తం అమ్మకాల్లో 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. సుంకల పెంపు వల్ల ఈ విభాగంలో ఖర్చు 22-28 శాతం పెరిగింది. జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ.. ధరలు పెరిగినప్పుడు ప్రారంభంలో అమ్మకాలు కొద్దిగా తగ్గినట్లు అనిపించినా, సిగరెట్ కంపెనీలకు ఉన్న 'ధరల నిర్ణయ సామర్థ్యం' (Pricing Power) వల్ల అవి తిరిగి లాభాలను సంపాదిస్తాయని పేర్కొన్నారు. పన్నులు ఎంత పెరిగినా కంపెనీల లాభదాయకతకు డోకా లేదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications