ఎన్టీఆర్పై నువ్వా - నేనా: వారసత్వంలో కొత్త ట్విస్ట్
హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబంలో ఆయన విగ్రహం ఏర్పాటు అంశం తీవ్ర విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారింది. విగ్రహం అంశం తోడళ్లుళ్లు మరోసారి రచ్చకెక్కేలా చేసింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి పురంధేశ్వరిలు ఇటీవల ఈ అంశం గురించి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వర రావు తోడల్లుడు బాబుపై సోమవారం నిప్పులు చెరిగారు.
వీరి విమర్శల నేపథ్యంలో వారసత్వ పోరు కొత్త రూపంలోకి మారినట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరును బాబు ఫేస్ చేశారు. ఓ వైపు నారా లోకేష్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్లు టిడిపి వారసత్వం కోసం ఇటీవలి వరకు పోటీ పడ్డారు. అసంతృప్తిగానేనా జూనియర్ అనూహ్యంగా ఆ రేసు నుండి తప్పుకోవడంతో లోకేష్కు సులభం అయిపోయింది. ఇటీవల ఎన్టీఆర్ తాను బాబు పాదయాత్రలో పాల్గొంటానని చెప్పడంతో ఫ్యామిలీలో విభేదాలు తొలగిపోయాయని పార్టీ క్యాడర్ సంతోషంలో మునిగిపోయింది.

ఎన్టీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు కొత్త రూపంలోకి మారినట్లుగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహం అంశం చంద్రబాబు, పురంధేశ్వరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రంగా మారింది.

ఇన్నాళ్లు టిడిపిలో వారసత్వ పోరు కొనసాగింది. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య అది కొనసాగింది. జూనియర్ రాజకీయాల్లోకి ఇప్పట్లో రానని చెప్పడం, మామయ్యకు అండగా ఉంటానని చెప్పడంతో టిడిపి వారసత్వ పోరుకు తెరపడింది.

అంతకుముందు కూడా చంద్రబాబుకు హరికృష్ణ పోటీ ఇచ్చారు. బాలకృష్ణ పేరు కూడా పలుమార్లు తెరపైకి వచ్చింది. అయితే అవన్నీ వెనక్కి పోయాయి. ఆ తర్వాత లోకేష్, ఎన్టీఆర్ కోసం నడిచింది.

పురంధేశ్వరి, చంద్రబాబుల మధ్య నడుస్తున్న వారసత్వ పోరు పార్టీ పగ్గాల కోసం కాకుండా ఎన్టీఆర్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం కోసం. పార్లమెంటులో విగ్రహాన్ని పెట్టించడం ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ను మరింతగా తన సొంతం చేసుకోవాలని పురంధేశ్వరి భావిస్తున్నారు. అదే సమయంలో బాబు కూడా అదే ధోరణితో ఉన్నారు.

దగ్గుపాటి వెంకటేశ్వర రావు, నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎన్టీఆర్ ఉన్నప్పటి నుండే పోరు ప్రారంభమైంది. ఆ తర్వాత టిడిపి బాబు చేతిలోకి రావడం, అసంతృప్తికి గురైన దగ్గుపాటి కాంగ్రెసు వైపు వెళ్లడం జరిగింది.
ఇప్పుడు వారసత్వ పోరు పురంధేశ్వరి, బాబుల వైపు తిరిగినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ వారసత్వ పోరుకు భిన్నమైనది. వారిద్దరి మధ్య టిడిపి పగ్గాల కోసం పోరు సాగింది. కానీ పురంధేశ్వరి టిడిపి పగ్గాల కోసం కాకుండా ఎన్టీఆర్ ఇమేజ్ను మరింత ఎక్కువగా తన సొంతం చేసుకోవాలనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తద్వారా చంద్రబాబును దెబ్బతీయాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది.
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు అంశం ఆమె వ్యూహంలో భాగంగానే కనిపిస్తోందని అంటున్నారు. విగ్రహానికి అనుమతులు రావడం, బాబు విమర్శలు చేయడం, పురంధేశ్వరి ఘాటుగా సమాధానం చెప్పడం, ఆ తర్వాత ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వర రావు తన తోడల్లుడుపై నిప్పులు చెరగడం చకచకా జరిగిపోయాయి. విగ్రహం ఏర్పాటు విషయంలో ఎవరికి వారే లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications