జగనొచ్చే వరకు ఓపిక పట్టండి: షర్మిల, రంగారెడ్డిలోకి..
మహబూబ్నగర్/హైదరాబాద్: తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల మంగళవారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన పైన, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీరు పైన ఆమె నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కూడా విమర్శల వర్షం కురిపించారు. పెంజర్ల వద్ద రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పలువురు రైతులు, మహిళలు ఆమె వద్దకు వచ్చి తమ సమస్యల గోడును వినిపించారు. జగన్ వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని అంత వరకు ఓపిక పట్టాలని షర్మిల వారికి చెప్పారు. జగన్ వచ్చాక సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. కాగా షర్మిల పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించనుంది.
సహకార సంఘం ఎన్నికలకు సిద్ధం
సహకార సంఘం ఎన్నికలకు తమ పార్టీ ఎప్పుడైనా సిద్ధంగా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. ఫిబ్రవరి నుండి కేంద్రం పరిధిలోకి వెళ్లబోయే సహకార సంఘాగలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరపాలని చూడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సహకార రంగంపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బాజిరెడ్డి ధ్వజమెత్తారు.