జైలులో వైయస్ జగన్ను కల్సిన టిడిపి ఎమ్మెల్యే వనిత
జగన్ను కలిసిన అనంతరం వనిత మాట్లాడుతూ... దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆ పథకాలను ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. వైయస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగల సత్తా కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని వనిత చెప్పారు. వనితపై అక్టోబర్ 31వ తేదిన టిడిపి సస్పెన్షన్ వేటు వేసింది.
వనిత 2009 సాధారణ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గోపాలపురం నుండి గెలుపొందారు. ఇటీవల ఆమె తెలుగుదేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడారని చెబుతూ టిడిపి ఆమెను పార్టీ నుండి బహిష్కరించింది. వనిత జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనారు. జగన్ వైపుకు వెళ్లేందుకే వనిత సొంత పార్టీపై విమర్శలు చేశారని అప్పుడు టిడిపి నేతలు భావించారు.
జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా
కాగా అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు ఈ నెల 13వ తేదికి వాయిదా వేసింది.