వైయస్ లాంటివాడే జగన్, ఆదరించండి: విజయమ్మ
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వైయస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని, ఆ ప్రాజెక్టు కోసం వైయస్ ఎంతో కృషి చేశారని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ ప్రాజెక్టును కాంగ్రెసు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా జరిగిందని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితి ఉందని ఆమె అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని వైయస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో రెండు గంటలు కూడా కరెంట్ ఉండడం లేదని అన్నారు. విద్యుత్ కోతలతో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొరతతో రైతులు ఇక్కట్లపాలవుతున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
ఉన్నతాశయంతో వైయస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే డీజిల్ లేదనే సమాధానం వస్తోందని ఆమె అన్నారు. పేదలు ఉన్నత విద్యను అభ్యసించాలని వైయస్ ఫీజు రీయంబర్స్మెంట్ను ప్రవేశపెట్టారని, మైనారిటీలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఐదు శాతం రిజర్వేషన్ల కల్పించారని ఆమె గుర్తు చేశారు. పన్నులు వేయకుండా పాలన సాగించిన ఘనత వైయస్దేనని ప్రశంసించారు.
వస్తున్నా... మీకోసం పేరుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బూటకపు పాదయాత్ర చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. గతంలో ఉచిత విద్యుత్ పథకాన్ని చంద్రబాబు ఎగతాళి చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అధికారం కోసమే ఇప్పుడు ఉచిత విద్యుత్తు హామీ ఇస్తున్నారని విమర్శించారు.