ఎన్టీఆర్ నివాసం కూల్చివేత: లక్ష్మీ పార్వతి మండిపాటు
కూల్చి వేస్తున్న భవనాన్ని వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఎన్డీఆర్ నడిచిన దేవాలయాన్ని కూల్చడం దారుణమన్నారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ దుర్మార్గాన్ని ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఆమె అన్నారు. తాను ఉండగా ఇంటి నిండా ఎన్టీఆర్ జ్ఞాపకాలతో నింపేసే దానిని అని చెప్పారు. ఎవరైనా వచ్చినప్పుడు వాటిని చూపిస్తూ గడిపేదాన్నన్నారు. తనను బలవంతంగా ఆ ఇంటి నుండి బయటకు గెంటి వేసి ఇప్పుడు దానిని కూల్చి వేయడం దారుణమన్నారు.
కాగా లక్ష్మీ పార్వతి ఇంటిని కోర్టు అధికారులు గత సంవత్సరం ఖాళీ చేయించారు. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 13లో ఈ ఇల్లు ఉంది. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుండి ఆమె అందులోనే ఉంటున్నారు. ఎన్టీఆర్ వీలునామా ప్రకారం ఆ ఇల్లు చిన్న కూతురు ఉమా మహేశ్వరికి దక్కింది. ఉమా మహేశ్వరి ఈ ఇంటి పవర్ ఆఫ్ అటార్నీని తన సోదరుడు రామకృష్ణకు ఇచ్చారు.
లక్ష్మీ పార్వతిచే ఇల్లు ఖాళీ చేయించాలంటూ రామకృష్ణ కోర్టును ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టు ఇళ్లు ఖాళీ చేయాలంటూ లక్ష్మీ పార్వతిని ఆదేశించింది. అయితే ఇచ్చిన గడువులోగా ఆమె ఖాళీ చేయకపోవడంతో కోర్టు అధికారులు ఇంటిని ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేయించేందుకు రామకృష్ణ వెళ్లారు. ఇళ్లు ఖాళీ చేయించడంపై లక్ష్మీ పార్వతి అప్పుడు మండిపడ్డారు.