కిరణ్కు గవర్నర్ మరో షాక్: మంత్రి ధర్మాన ఫైల్ వెనక్కి
ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైలు పైన మరోసారి న్యాయనిపుణులతో చర్చించి వారి సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కేసును మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేశాడు. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ ఓకె చెప్పకుండా ప్రభుత్వానికి షాక్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. గవర్నర్ ఫైలును వెనక్కి తిప్పి పంపడంతో ప్రభుత్వం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది.
ఈ ఫైలును ప్రభుత్వం రెండోసారి పంపించే అవకాశముంది. మరోసారి పంపిస్తే గవర్నర్ తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే రెండోసారి వెంటనే పంపించాలా లేక మరోసారి న్యాయసలహాలు తీసుకోవాలా అనే అంశంపై కిరణ్ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రభుత్వం రెండోసారి గవర్నర్కు పంపించి తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్చే ఆమోదింప చేసుకున్నా అది కాంగ్రెసుకు ఇబ్బందే అని చెప్పవచ్చు. గవర్నర్ ఫైలును వెనక్కి తిప్పి పంపడంతో ధర్మాన ప్రసాద రావు సంకటంలో పడ్డారు.
రాష్ట్ర మంత్రివర్గం గత నెల 23వ తేదిన ధర్మానను సిబిఐ విచారణకు అనుమతించవద్దని తీర్మానించింది. దానిని ఆ తర్వాత గవర్నర్కుపంపించింది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కేబినెట్ నిర్ణయంతో అప్పుడే విభేదించారు. ఆగస్టు 7వ తారీఖున వాన్ పిక్ కేసులో ఏడవ నిందితుడిగా ధర్మానను సిబిఐ పేర్కొంటూ ఛార్జీషీట్ దాఖలు చేసింది. కాగా గతంలో సమాచార హక్కు చట్టం కమీషనర్ల నియామకంలోనూ గవర్నర్ కిరణ్కు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.