దేవతంటాడు, దెయ్యమంటాడు: కెసిఆర్పై చంద్రబాబు
ఆయన శుక్రవారం కరీంనగర్ జిల్లాలో తన పాదయాత్రను కొనసాగించారు. తెలంగాణపై కాంగ్రెసు తన వైఖరిని చెప్పకుండా తెలుగుదేశం పార్టీని అవమానిస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మన ప్రసాద రావును ఎందుకు వదిలిపెట్టారని, ఎందుకు ధర్మానను అరెస్టు చేయలేదని ఆయన అడిగారు. ధర్మాన ప్రాసిక్యూషన్ను అడ్డుకునేందుకు గవర్నర్ను ఆశ్రయించడాన్ని ఆయన తప్పు పట్టారు.
సుప్రీంకోర్టు 26 జీవోల వ్యవహారాన్ని తప్పు పట్టినా, సమర్థించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. రైతుల పంటలకు మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు.
బెల్టు షాపులు పెట్టి ప్రభుత్వం యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు తగిన సౌకర్యాలు కల్పించకుండా ప్రైవేట్ విద్యా సంస్థలకు దారి చూపిస్తోందని ఆయన విమర్శించారు. 26 జీవోల జారీ విషయంలో మంత్రులకు ప్రభుత్వం సహాయం చేయడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నేరస్తులను, అవినీతి మంత్రులను కాపాడుతున్నారని ఆయన విమర్శించారు.