షర్మిల చెల్లెలిలాంటిది, కలుస్తా: దానం, సీటు కోసం దస్తీ

షర్మిలను పరామర్శిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి తమ నాయకుడని, వైయస్ తమ గుండెల్లో ఉంటారని ఆయన అన్నారు. తన వ్యాఖ్యల్లో ఏ విధమైన రాజకీయం లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని వ్యక్తిగతంగా తాను అభిమానిస్తానని చెప్పారు. దానం నాగేందర్ మొదటి నుంచి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యం కారణంగా దానం నాగేందర్ వైయస్ జగన్ వైపు వెళ్తారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది. అయితే, ఇటీవలి కాలంలో ఆయన కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించారు.
ఇప్పటికిప్పుడు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఏమీ లేవు. కానీ ఎన్నికలు సమీపించేనాటికి ఆయన ఆ పార్టీలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ముందుగానే ఆ వ్యాఖ్యల ద్వారా ఆయన దస్తీ వేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో మజ్లీస్తో కాంగ్రెసు పొత్తు కారణంగా దానం నాగేందర్ సులభంగా విజయం సాధించారు.
ఎన్నికలు సమీపించిన సమయంలో పరిస్థితిని బట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగానే దానం నాగేందర్ ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అయితే, దానం నాగేందర్ మాత్రం ఇందులో రాజకీయం ఏమీ లేదని, వ్యక్తిగత తాను వైయస్ రాజశేఖర రెడ్డిని అభిమానిస్తానని మాత్రమే చెప్పానని అంటున్నారు. ఏమైనా, దూకుడు రాజకీయాలకు ఇంకా అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications