గ్యాంగ్ రేప్: బొత్స సంచలన వ్యాఖ్యలు, జగన్ పార్టీ ఫైర్
తాను ఎవరి హృదయాను గాయపర్చాలని అలా అనలేదన్నారు. ఓ తండ్రిలా, సోదరుడిలా మాత్రమే భావించి అలా చెప్పానన్నారు. ఎవరినైనా గాయపరిస్తే అపార్థం చేసుకోవద్దన్నారు. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానని బొత్స చెప్పారు. గాంధీ భవనంలో మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. సహకార ఎన్నికల్లో గెలవలేమనే టిడిపి నేతలు రాద్దాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు.
మంత్రి లేనపుడు ఆయన ఇంటిని ముట్టడించడమేమిటని ప్రశ్నించారు. మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి ఇంటిని ముట్టడించడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. సహకార సంఘం ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనను కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతి విషయాన్ని కావాలనే రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు.
జనవరి ఏడున విజయవాడలో పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రాంతీయ సదస్సు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్య నేతగా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలన్నారు. కెసిఆర్ సంస్కారంతో మాట్లాడాలన్నారు. గ్యాంగ్ రేప్ ఘటనపై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖండన
మహిళలపై బొత్స చేసిన వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సాంస్కృతిక విభాం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సరికాదన్నారు. బొత్స భార్య ఓ ఎంపి.. అర్ధరాత్రి పార్టీ కార్యక్రమాల కోసం తిరగడం లేదా అని ప్రశ్నించారు. బొత్స తన మనసులోని ఉద్దేశ్యాన్ని బయట పెట్టారన్నారు.