ఆ పార్టీల గతే వైయస్ జగన్ పార్టీకి: తెలంగాణపై నాగం
ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని చెప్పాలని ఆయన అన్నారు. ఇంత మంది పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం చెప్పకపోవడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర పార్టీలు కుమ్మక్కయినట్లు కనిపిస్తున్నాయని, తెలంగాణను అడ్డుకోవడానికి వీలుగా పార్టీలు అభిప్రాయాలు బయటపెడుతున్నాయని అన్నారు.
తమ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించాలని ఆయన తెలంగాణ నాయకులను కోరారు. పార్టీల మీద, జెండాల మీద తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై వైఖరిని వెల్లడించే విషయంలో కాంగ్రెసు ముందు వరుసలో ఉండాలని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
తెలంగాణకు అనుకూలంగా అఖిల పక్ష సమావేశంలో నిర్ణయం చెప్పాలని కోరుతూ కోదండరామ్తో పాటు తెలంగాణ జెఎసి నేతలు అన్ని పార్టీల నేతలను కలుస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను ఇది వరకే కలిశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వారు మంగళవారం సాయంత్రం కలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.