హిమాచల్ సిఎంగా వీరభద్ర సింగ్ ప్రమాణం, రికార్డు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ మంగళవారం ఉదయం 10-30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఊర్మిలా సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. వీరభద్ర సింగ్ ఒక్కరే ప్రమాణం చేశారు, మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. కాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వీరభద్రసింగ్ ప్రమాణం చేయడం ఇది ఆరోసారి. ఇది రికార్డు. అధికార బిజెపిని ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓడించింది. దీంతో వీరభద్ర సింగ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
ఇదిలావుంటే, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 78 ఏళ్ల వీరభద్రసింగ్ ప్రమాణం చేపట్టిన తరుణంలో ఆయనకు మరో పెద్ద ఊరట లభించింది. 23 ఏళ్ల నాటి ఆడియో సీడీ కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. అవినీతి, కుట్ర అభియోగాలను కొట్టేస్తూ ఆయనను ప్రత్యేక జడ్జి బీఎల్ సోనీ నిర్దోషిగా సోమవారం ప్రకటించారు. సిమ్లాలోని చారిత్రక రిడ్జ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా ఆరోసారి పగ్గాలు చేపట్టారు.
1989లో సీఎంగా ఉన్న సమయంలో సింగ్, ఆయన భార్య ముడుపుల కోసం ఐఏఎస్ అధికారి మొహిందర్లాల్, మరికొందరు పారిశ్రామికవేత్తలతో బేరసారాలు ఆడారనే ఆరోపణలొచ్చాయి. ఇందులోభాగంగా వారు జరిపిన సంభాషణల ఆడియో సీడీని ప్రత్యర్థులు బయటపెట్టారు. అయితే ఆ ఆరోపణలను సింగ్ తోసిపుచ్చారు. అది సృష్టించిన సీడీయేనని వాదించారు. సాక్షులు అడ్డం తిరగడంతో కేసు వీగిపోయింది.