అఖిలపక్షం: తెలంగాణకు అనుకూలమా, తేలుతుందా?
తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్టీ చెప్పగా, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామనీ తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది. దీంతో ఈ రెండు పార్టీల అభిప్రాయం కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు మాత్రమే స్పష్టమైన వైఖరి చెప్పలేకపోయిందని అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గానీ బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి గానీ ఆ రెండు పార్టీల అభిప్రాయాలను తప్పు పట్లలేదు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. రాయల తెలంగాణను అంగీకరిస్తామని మజ్లీస్ చెప్పింది. ఈ రెండు పార్టీలు తప్ప మిగతా ఆరు పార్టీలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి, బిజెపి తెలంగాణకు అనుకూలంగా చెప్పినట్లేనని భావిస్తున్నారు. కాంగ్రెసు మాత్రం పూర్తిగా తేల్చలేకపోయింది.
ఆ పార్టీల వైఖరులు వెల్లడైన తర్వాత కాంగ్రెసు వైఖరి కూడా స్పష్టంగా వెల్లడి కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే చాలా మంది కాంగ్రెసు నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యంలో పడింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వైఖరిని తెలంగాణ నగారా నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన స్వాగతించడమంటే పరిణామంలోని సానుకూలతను అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.
నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని అఖిల పక్ష భేటీ తర్వాత సుశీల్ కుమార్ షిండే చెప్పారు. గతంలో అఖిల పక్ష భేటీ తర్వాత గత హోం మంత్రి పి. చిదంబరం నాలుగు వారాల్లో తెలంగాణ అంశాన్ని తేలుస్తామని చెప్పారు. దాంతో షిండే మాటలను నమ్మే వాతావరణం లేకుండా పోయింది. కాంగ్రెసుపై విశ్వాసం సన్నగిల్లడం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడింది. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన నిర్ణయం వెలువరిస్తే తప్ప నమ్మడానికి వీలు కాదని అంటారు. మరింతగా తెలంగాణ అంశాన్ని నాన్చడానికి కేంద్రం వ్యూహాత్మకంగా అఖిల పక్ష భేటీని వాడుకుంటుందనే అభిప్రాయం మాత్రమే వ్యక్తమవుతోంది.