లక్ష్మణ రేఖ దాటితే...: మహిళలపై బిజెపి నేత వ్యాఖ్య
మధ్యప్రదేశ్ మంత్రి, బిజెపి సీనియర్ నేత కైలాస్ విజయ్వర్గియా రామాయణాన్ని ఉటంకిస్తూ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "ఒకటే మాట - మర్యాద. మర్యాదను ఉలంఘిస్తే సీత అపహరణ జరుగుతుంది. ప్రతి వ్యక్తికీ లక్ష్మణ రేఖ గీసి ఉంటుంది. లక్ష్మణరేఖ దాటితే... రావణుడు ఎదురుగా కూర్చుని ఉన్నాడు. సీతను అపహరించుకుని వెళ్లిపోతాడు" అని ఆయన వ్యాఖ్యానించారు.
మహిళలు నైతిక పరిధులు దాటితే శిక్షకు అర్హులు అనే పద్ధతిలో మాట్లాడిన ఆయన మాటలు బిజెపిని ఇరకాటంలోకి నెట్టాయి. మహిళలు ఆంక్షలు దాటితే సీతాపహరణ జరిగినట్లుగా మహిళలకు శిక్ష పడుతుందని ఆయన అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.
లైంగిక వేధింపులకు గురైన మహిళల పట్ల విద్యావంతులు, ప్రముఖులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. పశ్చిమ బెంగాల్లో పార్క్ స్ట్రీట్ అత్యాచారం సంఘటనను తనపై సిపిఎం కుట్రగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభివర్ణించారు. పార్క్ స్ట్రీట్ సంఘటన అత్యాచారం కాదని, మహిళకూ క్లెయింట్కూ మధ్య అవగాహన కుదరకపోవడం వల్ల అలా ముందుకు వచ్చిందని అన్నారు.