అక్బరుద్దీన్ డుమ్మా: అనారోగ్యం, 4 రోజులు గడువు
ఈ రోజు అక్బరుద్దీన్ అదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసు స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా అక్బర్ హాజరు కావట్లేదని మజ్లిస్ చెబుతోంది. అక్బరుద్దీన్ తరఫున ఆయనకు చెందిన ఇద్దరు న్యాయవాదులు ఇస్మాయిల్, రసూల్ ఖాన్ నిర్మల్ పోలీసు స్టేషన్ ఎదుట హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా అక్బరు పోలీసు స్టేషన్కు ఈ రోజు హాజరు కాలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని వారు పోలీసులను కోరారు.
అక్బరుద్దీన్ నిర్మల్ పోలీసు స్టేషన్లో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన పోలీసులు హైదరాబాద్ నుండి నిర్మల్ వరకు అక్కడక్కడ బలగాలను మోహరించాయి. రోడ్డు మొత్తం ట్రాఫిక్ నియంత్రణకు నాలుగు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నిర్మల్లో 144వ సెక్షన్ విధించారు. నిర్మల్లో అదనపు బలగాలను మోహరించారు. మరోవైపు హైదారాబాదులో అక్బరుద్దీన్కు ఓవైసీ ఆసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు నిర్మల్ బందుకు పిలుపునిచ్చింది. పలుచోట్ల అక్బరుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. హైదరాబాదులో కూడా బిజెపి పలుచోట్ల నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేసింది. ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. మజ్లిస్కు, అక్బరుద్దీన్కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది.