బాబునే గద్దె దించాం.. కిరణ్ ఓ లెక్కా: అసద్ వీరావేశం
ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీ కార్యాలయంలో నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. అక్బరుద్దీన్ అంశం, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. సమావేశం అనంతరం అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. ఆయన ఆవేశంగా మాట్లాడారు. పనిలో పనిగా మీడియా పైన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముమ్మాటికీ దివంగత ప్రధాని పివి నరసింహా రావు వారసుడే అని ఆయన విమర్శించారు. ముస్లింలపై జరుగుతున్న దాడులను, ప్రభుత్వ విధానాలను తాము ప్రజలకు వివరిస్తామన్నారు. కిరణ్ సర్కారు 50 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లలో ఓడిందన్నారు. విహెచ్పి(విశ్వ హిందూ పరిషత్), బిజెపిని పట్టించుకోని మీడియా అక్బరుద్దీన్ వ్యవహారంపై మాత్రం దుష్ప్రచారం చేస్తోందన్నారు.
బాబును గద్దె దింపిన తమకు కిరణ్ ఓ లెక్క కాదన్నారు. కాంగ్రెసు పార్టీకి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతామన్నారు. సర్ ఛార్జీల పేరుతో విద్యుత్ మోత మోగిస్తూ సామాన్యుల పై పెను భారం మోపుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షాలు కూడా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కెజి బేసిన్ పైన ఎంపీలు అసమర్థులుగా వ్యవహరించారని ఆరోపించారు. అక్బర్ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు.
అక్బరుద్దీన్పై మరో కేసు
హిందూ దేవతలు, హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ పైన వరంగల్ జిల్లా జనగామలో మరో కేసు నమోదయింది. దిలీప్ అనే అతను కోర్టులో దరఖాస్తు చేశారు. దీంతో జనగామ కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.