వివాదాల పుట్ట, మాటమార్పు: ఎవరీ ఆశారాం బాపు?
బెంగళూరు: అత్యాచారానికి పాల్పడిన కీచకులతో అత్యాచారానికి గురైన 23 ఏళ్ల వైద్య విద్యార్థిని ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే ఆశారాం బాపు జత కట్టి వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం చేయడానికి వచ్చినవారిని సోదరులుగా సంబోధించి, సరస్వతీ మంత్రం జపించి ఉంటే ఆ వైద్య విద్యార్థిని సురక్షితంగా బయట పడి ఉండేదని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆశారాం బాపుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అంతటితో ఆగకుండా మీడియాను, తనపై విమర్శలు చేసినవారిని మొరుగుతున్న కుక్కలతో జమ కట్టారు. అయితే, తన వీడియోను తారుమారు చేశారని, వాస్తవాన్ని కప్పి పుచ్చారని ఆయన విమర్శించారు. ఇక తట్టుకోలేక క్షమాపణలు చెప్పారు. అత్యాచారానికి గురైన అమ్మాయిని తాను ఎలా నిందిస్తానని, తాను అంతటి క్రూరుడిని కాదని అన్నారు. తాను తప్పు చేసినట్లయితే క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు.
వివాదాలు రేపడం ఆశారాం బాపునకు ఇదే తొలిసారి కాదు. ఆయనను ఎల్లవేళలా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. భూకబ్జాలు, హత్యా ప్రయత్నం, ఇద్దరు పిల్ల హత్య వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
హిందూ ఆధ్యాత్మిక గురువు అయిన ఆశారాం బాపు - హిందు, ముస్లిం, సిక్కు, మతం ఏదైనా కానీ ఓ అతీత శక్తి ఉందని విశ్వసిస్తారు. భక్తి, జ్ఢానం, కర్మయోగ సిద్ధాంతాలను బోధిస్తారు. ఆధ్యాత్మికం, యోగాలపై ఆసక్తి పెరుగుతున్న క్రమంలో ఆయన కుటుంబాన్ని చాలా చిన్న వయసులోనే వదిలేశారు. బృందావనం చేరుకున్న తర్వాత తన దేశద్రిమ్మరి జీవితానికి స్వస్తి చెప్పారు.

స్వామి శ్రీ లీలాషాజీ మహరాజ్ నుంచి స్పూర్తి పొందిన ఆశారాం బాపు సన్యాసిగా మారారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సంత్ శ్రీ ఆశారాంజీ ఆశ్రమాన్ని ఆయన నడుపుతున్నారు.
సన్యాసిగా ఆశారాం బాపూజీ ఎన్నో ఎగుడుదిగుళ్లను చవి చూశారు. ఆయన ఓ హత్య కేసులో, మృతి కేసులో, భూకబ్జా కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆశారాం బాపుపై, మరో ఇద్దరిపై 2009లో గుజరాత్ పోలీసులు 2009లో హత్యాప్రయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆశారాం బాపుపై ఆరోపణలు చేయడంతో ఆయన మాజీ అనుచరుడు రాజు చందక్పై దాడి జరిగింది. ఆశ్రమంలో తంత్రపూజలు చేస్తూ అభ్యంతరకరమైన స్థితిలో ఆశారాం బాపును తాను చూసినట్లు చందక్ అఫిడవిట్ దాఖలు చేశాడు.
పోలీసుల సహాయంతో జిల్లా అధికారులు 2000లలో ఆశారాం ఆశ్రమం స్వాధీనంలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. తమ భూములను అక్రమంగా కబ్జా చేశారని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ చర్యకు దిగారు. ప్రభుత్వం అశ్రమానికి 2000లలో పది ఎకరాలు కేటాయించింది. అయితే, మరో 18,000 చదరపు మీటర్లను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.
మొతేరాలోని ఆశ్రమం గురుకులంలో చదువుకుంటున్న 10 ఏళ్ల దిపేష్ వాఘేలా, 11 ఏళ్ల అభిషేక్ వాఘేలా అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలు కూడా మాయమయ్యాయి. ఆ తర్వాత 2008 జులై 5వ తేదీన వారి మృతదేహాలు సాబర్మతి తీరంపై కనిపించాయి.
పిల్లలు అనుమానాస్పద మృతిపై దర్యాప్తునకు తొలుత కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తును సిఐడి తీసుకుంది. ఆశ్రమానికి చెందిన ఏడుగురిపై సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే, ఆశ్రమంలోని తాంత్రిక పూజలపై, చేతబడిపై లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైంది. ఏమైనా, 71 ఏళ్ల ఆశారాం బాపు ప్రయాణం చాలా వరకు వివాదాస్పదంగానే ఉంది.












Click it and Unblock the Notifications