వైబ్రాంట్లో పాకిస్తాన్కు మోడీ నో: తిప్పి పంపిన వైనం
22 మందితో కూడిన ఓ పాక్ బృందం గుజరాత్కు వచ్చింది. అయితే అత్యంత గౌరవంగా పాకిస్థాన్ బృందాన్ని వైబ్రెంట్ గుజరాత్ సదస్సు నుంచి తిప్పి పంపారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొనడంతో మోడీ ప్రభుత్వం పాక్ బృందాన్ని వెంటనే గుజరాత్ వదిలి వెళ్లాల్సిందిగా కోరింది. అయితే, ఈ విషయంపై వ్యాఖ్యానించేందుకు మాత్రం గుజరాత్ సర్కారు నిరాకరించింది. అంతేకాదు.. ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాల్సిన ఈ బృందాన్ని అక్కడకు కూడా రాకుండా అహ్మదాబాద్లోని హోటల్ గదిలోనే ఉంచేశారు.
కాగా పాకిస్థానీ బృందం వైబ్రెంట్ గుజరాత్ సదస్సుకు ముందు జరిగిన అమ్మకందారులు - కొనుగోలుదారుల సమావేశంలో పాల్గొందని గుజరాత్ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి మహేశ్వర్ సాహూ తెలిపారు. సదస్సులో భాగంగానే ఈ సమావేశం కూడా జరిగిందని, అందులో పాల్గొనేందుకే పాక్ బృందం వచ్చిందని, గాంధీనగర్లో 11, 12 తేదీల్లో జరిగిన ప్రధాన సదస్సులో పాల్గొనలేదని హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే నందా వివరించారు. వారికి అహ్మదాబాద్ వరకే వీసాలున్నాయని, కొందరికి సూరత్కు కూడా వీసా ఉండటంతో అక్కడకు వెళ్లారని తెలిపారు.
మరోవైపు రెండు రోజుల క్రితం పాకిస్తాన్ మరోసారి బరితెగించిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. అంతకుముందు ఇద్దరు జవాన్ల తలలు నరికి పాకిస్తాన్ తన పాశవిక చర్యను బయట పెట్టుకుంది. ఆ తర్వాత ఇలా పలుమార్లు ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
బిజెపి ప్రశ్న
నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తలు పెరుగుతున్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నోరు మెదపడం లేదని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కాశ్మీరులోని మెంధార్ సెక్టారులో ఇద్దరు భారత సైనికులను పాకిస్తాన్ చంపినా ప్రధాని మౌనంగా ఉన్నారని, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ విమర్శించారు.