తెలంగాణ: సేఫ్జోన్లో బాబు, నేతలే జగన్ పార్టీ టార్గెట్
బాబుపై కినుక
సీమాంధ్ర నేతలు బాబుపై కినుక వహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి, తమ్మినేని సీతారాం, పయ్యావుల కేశవ్ తదితర నేతలు పార్టీతో విభేదిస్తున్నామని చెప్పనప్పటికీ తెలంగాణపై పార్టీ నిర్ణయంతో విభిదిస్తున్నారు. వారే కాకుండా చాలామంది నేతలు పార్టీ నిర్ణయం పట్ల, బాబు వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నారట. తెలంగాణకు అనుకూలమని చెప్పి బాబు సేఫ్ జోన్లో పడిపోయారని, తాము మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందుతున్నారట.
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో చంద్రబాబు సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పట్టించుకోకుండా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వలన ఇప్పుడు తాము కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు టార్గెట్గా మారిపోయామని ఆవేదన చెందుతున్నారట. అందుకే ఎప్పుడూ మీడియాలో కనిపించే ఎక్కువ మంది నేతలు కినుక వహించే బయట ఎక్కువగా కనిపించడం లేదంటున్నారు.
కాంగ్రెసు పార్టీ నేతల్లా సమైక్యాంధ్రకు అనుకూలంగా గట్టిగా మాట్లాడలని వారు కూడా భావిస్తున్నప్పటికీ చంద్రబాబు బ్రేకులు వేస్తున్నారట. దీంతో విమర్శిస్తున్న నేతలకు సమాధానం చెప్పుకోలేక, బాబును ఎదురించలేక సమాలోచనలు జరుపుతున్నారట. సమైక్యాంధ్రకు అనుకూలంగా సభలకు, సమావేశాలకు అప్పుడే తొందర వద్దని బాబు వారుకు సూచిస్తున్నారట. కేంద్రం నిర్ణయాన్ని బట్టి నడుచుకోవాలని ఆయన సూచిస్తున్నారట.
బాబు మాటలను బట్టి ఆయన మానసికంగా రాష్ట్ర విభజనకు సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. అదే నిజమైతే 28లోగా కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా తాము ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని సీమాంధ్ర నేతల్లో ఉందట. కాంగ్రెసు, జగన్ పార్టీ తెలంగాణ విషయంలో తమను దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారట.
విభజనపై వేడెక్కుతున్న ఈ సమయంలో కాంగ్రెసు, జగన్ పార్టీ నేతలు సీమాంధ్రకు అనుకూలంగా బలమైన వాదనలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెదవి విప్పకుంటే తమ పరిస్థితి భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతుందని వారు ఆవేదన చెందుతున్నారట. అందుకే బాబు వద్దన్నా త్వరలో సమైక్యాంధ్రకు అనుకూలంగా భేటీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. అవసరమైతే టిడిపిని, ఇంకా అవసరమైతే మరింత ముందుకు వెళ్లేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.