28లోగా నిర్ణయం రాదు: టిజి, రాజీనామాలపై వెనక్కి
అందుకే తాము సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణకు కేంద్రం అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయాన్ని బుధవారం వ్యక్తం చేసిన అంశంపై స్పందిస్తూ అది ఔట్ డేటెడ్ అన్నారు. టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు బుధవారం మాట్లాడుతూ.. తెలంగాణకు అనుకూలంగా కేంద్రం, అధిష్టానం ఉన్నట్లుగా మాట్లాడారు. ఈ రోజు మాత్రం వారు ఇతర సీమాంధ్ర నేతల ఒత్తిడితో కాస్త వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. అందుకే 28లోగా తెలంగాణ రాదని, అయితే ఎప్పటికైనా భయం మాత్రం ఉందని టిజి చెప్పారు.
సమావేశానికి మొత్తం 68 మంది నేతలు వచ్చారని, పద్నాలుగు మంది మంత్రులు వచ్చారని మంత్రి శైలజానాథ్ అన్నారు. మరో నలుగురు మంత్రులు వివిధ కారణాల వల్ల రాలేదన్నారు. వారు సమైక్యాంధ్రకు మద్దతు పలికారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఏకవాక్య తీర్మానం చేసినట్లు చెప్పారు. దానిని అధిష్టానానికి, కేంద్రానికి పంపిస్తామన్నారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉండే అంశంపై వారు స్పందించలేదు.
ఒకవేళ కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాము అధిష్టానాన్ని ఒప్పించి సమైక్యాంధ్రను నిలబెట్టుకుంటామన్నారు. 21న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వీలైతే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగా వస్తే రాజీనామాలు కాకుండా అధిష్టానాన్ని ఒప్పిస్తామన్నారు. మెజార్టీ ప్రజలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నారన్నారు.
మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏకవాక్య తీర్మానం చేసినట్లు చెప్పారు. అధిష్టానం నిర్ణయం ఏమిటో ఇంకా రాలేదని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు.
భేటీకి ముందు తర్వాత....
1. భేటీకి మందు పలువురు నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా ఘాటుగా స్పందించారు. కానీ భేటీ తర్వాత ఆ వేడి కనిపించలేదంటున్నారు.
2. విభజనపై కేంద్రం, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పలేదు.
3. నిర్ణయం తమకు అనుకూలంగా లేకుంటే రాజీనామాలు చేస్తామని చెప్పలేదు. అధిష్టానాన్ని ఒప్పిస్తామన్నారు. రాజీనామా అంశం అప్పుడే అవసరం లేదన్నారు.
4. ఢిల్లీ పరిణామాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పిన నేతలు ఆ తర్వాత 28లోగా తెలంగాణపై నిర్ణయం రాదన్నారు.