రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ ప్రసంగంలోనే తెలంగాణ?
గతంలో డిసెంబర్ 9వ తేదీన అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి మళ్లిందనే అభిప్రాయం ఉంది. దానివల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినా మళ్లీ వెనక్కి వెళ్లదనే గ్యారంటీ ఏమీ లేదనే అభిప్రాయం కలుగుతుందని, రాష్ట్రపతి ప్రసంగంలో ఆ ప్రస్తావన చేస్తే వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదనే అభిప్రాయాన్ని బలంగా నాటవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జైపూర్ చింతన్ భైఠక్లో తెలంగాణపై విస్తృతంగా చర్చిస్తారని అంటున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తెలంగాణకు సంబంధించి తగిన సూచనలను కాంగ్రెసు అధిష్టానం ఇచ్చే అవకాశాలున్నాయి. చింతన్ భైఠక్లో చర్చించిన తర్వాత ఆ తర్వాత ఎఐసిసి సమావేశం నిర్వహించి తెలంగాణకు అనుకూలంగా అధికారికంగా పార్టీపరంగా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. హైదరాబాదు విషయంపై కూడా కచ్చితమైన నిర్ణయమే తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
పార్టీపరంగా తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఈ నెల 20, 25 తేదీల మధ్య చర్చలకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. కెసిఆర్తో పార్టీపరంగా చర్చలు జరుపుతారా, ప్రభుత్వపరంగా చర్చలు జరుపుతారా అనేది తెలియడం లేదు. అయితే, తెరాసను తమ పార్టీలో విలీనం చేయించుకోవడానికి చేయాల్సిన కసరత్తును కెసిఆర్తో చర్చించవచ్చునని అంటున్నారు.
మొత్తం మీద, తెలంగాణకు సంబంధించి యుపిఎ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఆ ప్రకటన తెలంగాణకు అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయమే బలంగా ఉంది. తెలంగాణ కాంగ్రెసు నాయకులకు సహకరించే విధంగా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి.