తెలంగాణపై తెలియదన్న వాయలార్: పోటాపోటీ భేటీలు

కేంద్ర మంత్రి వాయలార్ రవి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కూడా తెలంగాణపై ఏ విధమైన సంకేతాలు ఇవ్వలేదు. తెలంగాణపై ఈ నెల 28వ తేదీన ప్రకటన వస్తుందో, రాదో తనకు తెలియదని ఆయన అన్నారు. జైపూర్ డిక్లరేషన్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించామని, దాని కిందికి తెలంగాణ వస్తుందో రాదో మీడియానే అన్వయించుకోవాలని ఆయన మంగళవారం సాయంత్రం అన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మాత్రం తెలంగాణ అంశం ఉందని అంగీకరించారు. ఇరు ప్రాంతాల్లో ఇప్పుడు వేడి పుట్టిందని ఆయన అన్నారు. తన వద్దకు వచ్చిన నేతలతో సమావేశమవుతూనే ఉంటానని ఆయన చెప్పారు.
తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించే గడువు సమీపించడంతో సీమాంధ్ర నేతలు విభజనను ఆపడానికి చివరి ప్రయత్నం చేస్తుండగా, విభజనకు అనుకూలంగా నిర్ణయం రాబట్టుకోవడానికి తెలంగాణ నేతలు ఆఖరు ప్రయత్నం చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. సీమాంధ్ర నాయకులు మంగళవారం ఉదయం వరుసగా ప్రధాని మన్మోహన్ సింగ్ను, వాయలార్ రవిని, గులాం నబీ ఆజాద్ను కలిశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిశారు.
తెలంగాణ నాయకులు గులాం నబీ ఆజాద్ను, సుశీల్ కుమార్ షిండేను, వాయలార్ రవిని కలిశారు. తెలంగాణ ఇస్తే 16 పార్లమెంటు సీట్లు, 80 శాసనసభ సీట్లు తెలంగాణ ప్రాంతంలో వస్తాయని తెలంగాణ నేతలు వాయలార్ రవితో చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకుల వాదనలను తాను అధిష్టానం ముందు ఉంచుతానని వాయలార్ రవి అన్నారు. సీమాంధ్ర నేతలపై గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
తెలంగాణపై ఈ నెల 25వ తేదీన గానీ 27వ తేదీన గానీ కేంద్రం ప్రకటన వెలువడవచ్చునని చెబుతున్నారు. నెలలోగా నిర్ణయం వెలువరించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు సుశీల్ కుమార్ షిండే ఒకటికి రెండు సార్లు చెప్పారు.












Click it and Unblock the Notifications