రాజీనామా: యాష్కీకి ఎదురుతిరిగిన ఐదుగురు ఎంపీలు

యాష్కీ ప్రకటనతో పాటు హైదరాబాదులో కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు చేసిన ప్రకటన కూడా ఎంపిలందరూ రాజీనామాలను ఉపసంహరించుకున్నారనే అభిప్రాయం కలగజేసింది. దీంతో రాజీనామాలు చేస్తామని చెప్పిన ఏడుగురు తెలంగాణ ఎంపీలు కూడా వెనక్కి తగ్గినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మందా జగన్నాథం, రాజయ్య, వివేక్, యాష్కీ తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించాలని హైదరాబాదులో నిర్ణయించుకున్నారు. వీరి ఉద్దేశం తెలియడంతో కేంద్ర మంత్రి వాయలార్ రవి వారిని ఢిల్లీకి ఆహ్వానించారు.
తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియా చేతిలో పెట్టి - తెలంగాణ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో తమ రాజీనామాలను స్పీకర్కు పంపించాలని కోరాలని అనుకున్నారు. అయితే, అకస్మాత్తుగా బుధవారంనాడు ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో నుంచి ప్రకటన వచ్చింది. తాము తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూ ఆయన చెప్పారు. దీంతో యాష్కీ చాకో ప్రకటనను తాము విశ్వసిస్తున్నామని, రాజీనామా చేయాలనే ఆలోచనను విరమించుకుంటున్నామని చెప్పారు.
తాము రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని యాష్కీతో విభేదిస్తూ మిగతా కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు బుధవారం రాత్రి ప్రకటన చేశారు. రాజీనామాలు అవసరం లేదనే విషయంపై ఏకాభిప్రాయం లేదని వారు చెప్పారు. ఢిల్లీ వెళ్లి చర్చలు చేయాలని తాము సూచించలేదని వారన్నారు. తమ రాజీనామా లేఖలను గురువారం సోనియా గాంధీ కార్యాలయంలో అందజేస్తామని వారు చెప్పారు. రాజీనామాలు అవసరం లేదని ఎవరైనా చెప్తే అది వారి వ్యక్తిగతమేనని ఎంపి రాజయ్య అన్నారు. పొన్నం ప్రభాకర్ కూడా తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు బుధవారంనాడు సోనియా గాంధీని కలిశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సోనియాను కోరారు. రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయంలో ఆలస్యం జరిగితే ఆత్మహత్యలు పెరుగుతాయని ఆయన సోనియాకు సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications