తెలంగాణ సెగ: చివరి దశలో ఉందని పొన్నాల మాట
తెలంగాణ అంశం చివరి దశలో ఉందని మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తెలంగాణపై కొందరు నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన బుధవారం మీడియాతో అన్నారు. తెలంగాణ ప్రజలు ఉద్వేగాలకు, ఉద్రేకాలకు లోను కావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కన్నా కాంగ్రెసు పార్టీకే ఎక్కువ చిత్తశుద్ధి ఉందని కాంగ్రెసు పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తమ పార్టీ అధిష్టానం పిలుపుమేరకే తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఢిల్లీ వెళ్లారని ఆయన చెప్పారు. ఆధార్ కార్డులపై ముఖ్యమంత్రిని కలిసిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆయన అన్నారు.
మతాన్ని రెచ్చగొట్టిన వ్యక్తులు జైలులో ఉన్నారని, ప్రాంతాన్నీ కులాన్నీ రెచ్చగొట్టేవారు కూడా జైలుకు వెళ్తారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు కె లక్ష్మారెడ్డి అన్నారు. ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పద్ధతి మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణను తామే తెస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు బిక్షమయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఇవ్వబోమని సోనియా, రాహుల్ గాంధీలు చెప్తే తాము ప్రజల ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 8వ తేదీన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుల సమావేశం జరుగుతుందని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.