తెలంగాణ కోసం మరో ఆత్మహత్య: బస్సును ఢీకొని..
నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం ఆ సంఘటన చోటు చేసుకుంది. రాజాపేట మండలం చల్లూరు గ్రామానికి చెందిన గందమల్ల రాములు (40) గత పదేళ్లుగా యాదగిరిగుట్ట మండలం మహబూబ్పేటలోని అత్తగారి ఇంటివద్ద నివసిస్తున్నాడు. తెలంగాణవాదిగా గుర్తింపు పొందిన రాములు ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ అనేక బహిరంగ సభల్లో ఒక కళాకారుడిగా సైతం తెలంగాణ పాటలను ఆలపించేవాడు. భువనగిరిలో ఓ పత్రికా విలేఖరిగా గత మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈనెల 28న తెలంగాణపై షిండే నుంచి అనుకూల ప్రకటన రాకపోవడంతో మనస్తాపానికి గురైన రాములు, ఇక తెలంగాణ రాదేమోనని కలతచెంది మంగళవారం ఉదయం తన గ్రామం నుంచి మోటార్ సైకిల్ పై వస్తూ భువనగిరి శివారులో జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన సిఐ మధుసూదన్రెడ్డి మృతదేహాన్ని పరిశీలించగా రాములు పర్సులో తెలంగాణ కోసం తాను ఆత్మ బలిదానానికి పాల్పడుతున్నానని రాసిన సూసైడ్ నోటు లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు సిఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి భార్యతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్టు తెలిసింది.