కెసిఆర్ బుద్ధి వికసించడం లేదు: మంత్రి టిజి వెంకటేష్
తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని ఏదో విధంగా రెచ్చగొట్టడం ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేయడమే తప్ప ప్రత్యేక రాష్ట్ర సాధనకు కెసిఆర్ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇతరులను కించపరిచేలా మాట్లాడితే సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు అనేక చర్చలు అవసరమని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలనుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నించాలే తప్ప అన్ని వర్గాల వారిని దూషిస్తూ చివరకు దేశాన్ని, దేశ ప్రధానిపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్దతి కాదని హితవు పలికారు. దేశం కోసం నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన త్యాగాలు ప్రతి చిన్న పిల్లవాడికి తెలుసునన్నారు. అలాంటి కుటుంబాల వారి పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం కెసిఆర్కు తగదని ఆయన అన్నారు.
కెసిఆర్ లాంటి వ్యక్తుల బ్లాక్మెయిలింగ్కు తలొగ్గి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు రాజీనామాలకు సిద్ధపడవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, నాయకులు కెసిఆర్ను రాజకీయ బహిష్కరణ చేసి చర్చల ప్రక్రియకు సిద్ధపడితే తెలంగాణ సమస్యకు వీలైనంత త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ లక్ష్యం కాదని సంపాదనే ఆయన కుటుంబ ధ్యేయమని టిజి వెంకటేష్ ఆరోపించారు. దీన్ని గ్రహించి తెలంగాణవాదులు, మేథావులు చర్చల ప్రక్రియకు సహకరిస్తూ ఉద్రిక్త వాతావరణానికి తెరదించాలని విజ్ఞప్తి చేశారు.