బొత్స కలకలం: కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రుల బాసట
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిందనే వ్యాఖ్యల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉందని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. 2014వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తాము విశ్లేషించబోమని అన్నారు.
తమ ప్రభుత్వంపై గతంలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ప్రతిపక్షాలు భంగపడ్డాయని తెలంగాణకు చెందిన మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని ఆమె శనివారంనాడు అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయనే సంకేతాలను మాత్రమే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇచ్చారని ఆమె అన్నారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినవారిపై వేటు వేయడంలో తప్పేమిటని ఆమె అడిగారు.
ప్రభుత్వం సుస్థిరంగా ఉందని తెలంగాణకు చెందిన మరో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని, తమది స్థిరమైన ప్రభుత్వమని ఆయన అన్నారు. ప్రభుత్వం మెజారిటీలోనే ఉందని, మైనారిటీలో లేదని కాసు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు. గత అసెంబ్లీలోనే తాము మెజారిటీనీ నిరూపించుకున్నామని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.