వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ. లక్ష సాయం.. ఇలా చేస్తే నేరుగా ఖాతాల్లో జమ..
దేశంలో అత్యంత ప్రముఖమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఒకటి. ఈ ఉద్యోగం సాధించినవారు కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా నియామకం అవుతారు. పేరు, హోదా, జీత భత్యాలు ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ అధికారులకు ఉండే గౌరవమే వేరు. ఏటా జరిగే ఈ పరీక్షకు లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. ఈ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఏ దశలో విఫలం అయినా మళ్లీ మొదటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో ఈ పరీక్షను రాస్తుంటారు. సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించాలనే లక్ష్యంతో కోచింగ్ తీసుకుని కసిగా ప్రిపేర్ అవుతుంటారు.
ఇక తెలంగాణలో ఈ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సాయం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ. లక్ష సాయం చేస్తోంది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పేరుతో.. సింగరేణి సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది రేవంత్ సర్కార్. ఈ పథకం ప్రకారం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అర్హులందరికీ రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి 2024 లో ప్రారంభించారు. ఆ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన 140 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు.
అయితే వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు. దాంతో వారికి మరో లక్ష ప్రోత్సాహకం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు ఏడుగురు సివిల్ సర్వీసెస్ విజేతలుగా నిలిచారు. అలాగే 2025 లో 206 మంది అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహకం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వారిలో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపిక అయ్యారు. చివరకు 20 మంది సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించారు. ఈ విధంగా గత రెండేళ్లలో మొత్తం 346 మంది పేద, మధ్య తరగతి అభ్యర్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించింది.
ఇక ఈ ఏడాది కూడా అదే విధంగా అభ్యర్థులకు రూ. లక్ష అందించనుంది. ఈ మేరకు తాజాగా ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తే.. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి రూ. లక్ష ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు www.scclmines.com వెబ్ సైట్ లో ఉన్నాయి. ఈ సైట్ ను ఓపెన్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయితే ఇప్పుడే అప్లై చేసుకోండి.

ఈ పథకానికి అప్లై చేయాలంటే అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసితులై ఉండాలి. అలాగే దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించి ఉండకూడదు. ఇక సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కసారి మాత్రమే ఈ స్కీమ్ కింద దరఖాస్తుదారుడికి సాయం అందుతుంది.












Click it and Unblock the Notifications