పోలీసు స్టేషన్లో అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచారం
ప్రవీణ్ ఆచూకీ కోసం అతని సోదరి(17), పెద్దమ్మలను పోలీసులు ఈ నెల 1వ తేదీ విచారణ పేరిట స్టేషన్కు పిలిపించారు. ఆ రోజు రాత్రి వారిని స్టేషన్లో స్వీపర్గా పనిచేసే శాంతమ్మ అనే మహిళ ఇంట్లో ఉంచారు. 2వ తేదీ స్టేషన్లో విచారించారు. రాత్రి ఎస్ఐ ఇంటికి వెళుతూ యువతిని, హంసమ్మను స్టేషన్లోనే ఉంచాలని సిబ్బందికి చెప్పారు. గోపీ అనే కానిస్టేబుల్ రాత్రి సెంట్రీ డ్యూటీలో ఉన్నాడు. మద్యం తాగి వచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు యత్నించిన ఆమె పెద్దమ్మను బెదిరించాడు.
ఈ సంఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కానీ, ఎస్ఐ పట్టించుకోలేదు. దీంతో మంగళవారం తల్లిదండ్రులు, బంధువులతో కలసి చిత్తూరుకు వచ్చి ఎస్పీ కాంతిరాణా టాటాను కలిశారు. తమ కూతురుకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ - వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని అదనపు ఎస్పీ అన్నపూర్ణను ఆదేశించారు.
అత్యాచారం జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుందని ఎస్పీ చెప్పారు. మహిళలను విచారణ పేరిట రాత్రిళ్లు స్టేషన్లో ఉంచడం నిబంధనలకు విరుద్ధమని, ఇది నిజమైతే ఎస్ఐపై కూడా చర్య తీసుకుంటామన్నారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లా అదననపు ఎస్పీ అన్నపూర్ణ మంగళవారం సాయంత్రం ఎస్ఆర్ పురం పోలీసు స్టేషన్కు వెళ్ళి విచారణ జరిపారు. కానిస్టేబుల్ గోపీపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.