‘జగన్ 2.ఓ సూపర్యాప్’ ఆవిష్కరించిన జగన్ - ఇబ్బందులు, వేధింపుల పై ఇక..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా భీమవరంలో జగన్ ప్రసంగం.. పర్యటన తీరు పైన పార్టీలో చర్చ సాగుతోంది. కాగా.. ఇప్పుడు పార్టీ కేడర్ కోసం జగన్ కొత్తగా యాప్ ఆవిష్కరించారు. దీని ద్వారా పార్టీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానించటంతో పాటుగా వేధింపులు.. ఫిర్యాదుల కోసం ఈ యాప్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
వైసీపీ అధినేత జగన్ 'జగన్ 2.ఓ సూపర్ యాప్' ఆవిష్కరించారు. పార్టీ కోసం పని చేసే వారికి అండగా నిలిచే లక్ష్యంతో ఈ యాప్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. పార్టీ కేడర్ తో నేరుగా మమేకం అవ్వటంతో పాటుగా వారి సమస్యలను ప్రస్తావించేందుకు ఈ యాప్ సహకరిస్తుందని చెప్పారు. పోలీసు వేధింపులు ఎదుర్కొంటున్న వారు ఈ యాప్ లో సమాచారం ఇవ్వటం ద్వారా పార్టీ తోడుగా నిలుస్తుందని జగన్ భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్టు చేస్తున్న కంటెంట్ను తొలగించడం, వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టించడం జరుగుతున్న నేపథ్యంలో 'జగన్ 2.ఓ సూపర్యాప్' ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చని చెప్పారు. ఎవరి ప్రమేయం, జోక్యం లేకుండా పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామి కావచ్చని పేర్కొన్నారు. పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరినీ ఒకే వేదికపై అనుసంధానించే విధంగా ఈ యాప్ను రూపొందించామని జగన్ స్పష్టం చేసారు.
కార్యకర్తలకు అండగా నిలుస్తాం
అదే విధంగా నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి సమావేశం, ప్రెస్మీట్, ముఖ్యమైన కార్యక్రమం, పార్టీ ప్రకటనలను లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు లేదా పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకు రావచ్చని చెప్పారు. భవిష్యత్తులో యాప్ను మరింత విస్తృతంగా అభివృద్ధి చేసి, కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

కాగా, పోలీసు వేధింపులు, రాజకీయ వేధింపులకు సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ డైరీని కూడా ఈ సూపర్యాప్తో అనుసంధానిస్తున్నామని జగన్ వెల్లడించారు. దీంతో కార్యకర్తలు తమ సమస్యలను, ఫిర్యాదులను నేరుగా యాప్లో నమోదు చేయాలని, వాటిపై పార్టీ వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications