ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా వైఎస్ లింక్: బాబు
ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా వైయస్ కుటుంబానికి సంబంధాలు బయటపడుతున్నాయన్నారు. క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ షెడ్యూల్ కులాల భూములను లాక్కున్నారని ఆరోపించారు. తాను ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మందిని ముఖ్యమంత్రులను చూశానని కానీ, వైయస్లా దోచుకున్న వారిని చూడలేదన్నారు. వైయస్ అవినీతి ఇప్పుడు మనల్ని దయ్యంలా పట్టి పీడిస్తోందన్నారు. జైల్లో ఉన్న వారిని నమ్మొద్దని జగన్ను ఉద్దేశించి అన్నారు.
గతంలో వచ్చిన నీలం తుఫాను, ప్రస్తుతం వచ్చిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం అంచనా నివేదికను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి పంపించలేదన్నారు. కనీసం, పంటలను పరిశీలించేందుకు అధికారులను కూడా పంపించలేదని విమర్శించారు. పంట నష్టపోయిన వారికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్న తమ డిమాండును పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చే పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటుందని చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నేతలు ఇంట్లో కూర్చుని సభ్యులను చేర్చుకున్నారని అందుకే, ఆ పార్టీ గెలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు చిత్తు కావడం ఖాయమన్నారు. టిడిపి హయాంలో వంట గ్యాస్, స్టవ్ ఉచితంగా ఇస్తే, కాంగ్రెసు తన హయాంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసిందని ఆరోపించారు. కాంగ్రెసు హయాంలో చనిపోయిన వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని, పింఛన్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు.