కోర్టుకు వెళ్లను: కోదండరాం, లగడపాటి గెలుస్తారా?: కెకె
తెలంగాణవాదులపై బైండోవర్ కేసులు పెట్టడం సరికాదన్నారు. అసలు బైండోవర్ కేసులు పెట్టాల్సింది కాంగ్రెసు పార్టీ నేతల పైనే అన్నారు. నేరస్తులపై కాకుండా ప్రజలపై బైండోవర్ కేసులు పెట్టడమేమిటన్నారు. తెలంగాణవాదులపై ప్రభుత్వం తీరు అనుచితం అమానుషం అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తరుచూ మాట తప్పుతుందని ఆ పార్టీకి తెలంగాణవాదులు బుద్ధి చెబుతారని అన్నారు.
తెలంగాణవాదులు బందు నిర్వహించకూడదని అధికార పార్టీ భావిస్తే వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. సడక్ బంద్ విజయవంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. మార్చి 2వ తేదిన జరగబోయే సడక్ బంద్ గురించి ఐక్యకార్యాచరణ సమితిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎపిఎన్జీవోల విషయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల కార్యాచరణకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. హోంమంత్రి మాటకే విలువలేదని ఆయన అన్నారు.
లగడపాటి గెలవగలరా?
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి స్థానం లేకుండా పోతోందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు కె కేశవ రావు, వివేక్, మందా జగన్నాథంలు సోమవారం అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం అంటున్న లగడపాటి రాజగోపాల్ వచ్చేసారి గెలవగలరా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీతో పాటు 16 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటామని వారు అన్నారు.
కానీ, రాష్ట్రం సమైక్యంగా ఉంటే రెండు ప్రాంతాల్లో కాంగ్రెసుకు నష్టమే అన్నారు. తెలంగాణ సాధనే తమ ధ్యేయం అన్నారు. పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై రేపు చర్చిస్తామని చెప్పారు.
కాంగ్రెసుకు బుద్ధి చెప్పాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెసుకు తగిన బుద్ధి చెప్పి తెలంగాణవాదాన్ని ఢిల్లీకి వినిపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. స్థానిక ఎన్నికల్లో తెరాసదే హవా అన్నారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు వాపును చూసి బలపు అనుకుంటోందన్నారు.