కెసిఆర్ తొందరపడ్డారు: నారాయణ, కవితపై బిజెపి ఫైర్
తెరాసకు తెలంగాణ కన్నా ఓట్లూ, సీట్లే ముఖ్యమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి వ్యాఖ్యానించారు. బిజెపిని విమర్శించే నైతిక హక్కు తెరాస నాయకులకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయాల్లో ఉన్నారా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం మజ్లీస్ మద్దతు కోరడం తెరాస నాయకుల స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని ఆనయ వ్యాఖ్యానించారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్ బంద్ జరిగి తీరుతుందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. మహబూబ్నగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన సడక్ బంద్ను శాంతియుతంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. తెలంగాణ ఉద్యమానికి మేధావుల మద్దతు ఉందని చాటడానికి ఎమ్మెల్సీ ఎన్నికలను పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తొలి నుంచి పోరాడుతున్నది తెరాస మాత్రమేనని ఆమె అన్నారు.