హిందూ టెర్రరిజం: షిండే సారీ! ఆలస్యమైంది ఐనా సరే!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. హిందూ ఉగ్రవాదంపై షిండే సారీ చెప్పడంతో బిజెపి కొంత శాంతించినా.. అగస్టా స్కాం, ద్రవ్యోల్బణం తదితరాలపై శరాలను ఎక్కుపెట్టాలని నిర్ణయించింది. దీనిని గుర్తించే ప్రతిపక్షాలతో కాంగ్రెస్ కాళ్లబేరానికి వచ్చింది. హిందూ ఉగ్రవాదంపై కేంద్ర హోం మంత్రి షిండే గతంలో చేసిన ప్రకటనను సమావేశాలకు ఒకరోజు ముందు ఉపసంహరించుకున్నారు.
సంఘ్ పరివార్ సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాయన్నది తన ఉద్దేశమే కాదని తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. తాను ఏ మతానికి ఉగ్రవాద రంగు పులిమేందుకు ప్రయత్నించలేదన్నారు. బుధవారం లోక్సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా లోక్సభాపక్ష నేత, హోం మంత్రి షిండే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ ప్రతిపక్షాలు అడిగిన అన్ని డిమాండ్లకు దాదాపు అంగీకరించారు.
అగస్టా కుంభకోణానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిపి) డిమాండ్కైనా తాము సిద్ధమేనని కమల్ నాథ్ చెప్పారు. అలాగే, హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యలపై లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్కు వివరణ ఇచ్చేందుకు ఇదే సమావేశంలో షిండే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను హామీ ఇచ్చిన విధంగా సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. కాగా అఖిలపక్ష సమావేశం తర్వాత స్పీకర్ ఇచ్చిన విందుకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రతిపక్ష నేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, బాసుదేవ ఆచార్య, నామా నాగేశ్వరరావు తదితరులను సాదరంగా పలకరించి, బడ్జెట్, బిల్లులను సజావుగా ఆమోదించేందుకు సహకరించాలని కోరారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.