ముఖ్య నగరాల పైన కన్నేసిన ఉగ్రవాద సంస్థలు ఇవే!
ఐఎస్ఐ కనుసన్నల్లో నడిచే లష్కరే తాయిబా తదితర 13 సంస్థలు గత 23 ఏళ్లలో విధ్వంసాలు సృష్టించి అనేకమందిని పొట్టన పెట్టుకున్నాయి. వివిధ సంఘటనల్లో ఇప్పటి వరకు 170 మంది ఉగ్రవాదులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు పాకిస్థానీయులు కాగా మిగతా వారంతా కాశ్మీర్తో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందినవారు. ఇప్పటి వరకు నగరంలో 25 కిలోల ఆర్డీఎక్స్, 25 చైనీస్ పిస్టళ్లు, 8 కిలోల సిల్వర్ నైట్రేట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరుడు కట్టిన సంస్థలు..
హిజ్బుల్ ముజాహిదీన్
1992లో ఈ సంస్థ తొలిసారి వెలుగులోకి వచ్చింది. కాశ్మీర్లో శిక్షణ పొందిన ముజీబ్ నేతృత్వంలో ఇది పనిచేసింది. టోలీచౌకిలో వీరు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ దాడి చేయగా.. ముజీబ్ గ్యాంగ్ కృష్ణ ప్రసాద్ను, ఆయన గన్మన్ వెంకటేశ్వర రావును కాల్చిచంపి పరారయ్యారు.
ఇఖ్వాన్ ఉల్ ముసల్మీన్
1993 హైదరాబాద్లో భారీ పేలుళ్లకు కుట్రపన్నగా పోలీసులు నిస్సార్ అహ్మద్ భట్ గౌర్ అమీన్ మీర్ అనే వారిని ముందుగానే అరెస్ట్ చేశారు.
తన్జీమ్ ఇస్లాముల్ ముసల్మీన్
1993-94లో నగరంలో ఐదుచోట్ల జరిగిన బాంబుపేలుళ్లలో నిందితులు. ముంబైకి చెందిన అబ్దుల్ కరీమ్తో కలిసి రాష్ట్రానికి చెందిన అజాంఘోరీతో కలిసి నగరంలో పాపయ్యగౌడ్, నందరాజు గౌడ్ అనే రాజకీయ నేతలను కాల్చిచంపారు.
అల్ జీహద్
1994లో ఈ సంస్థకు చెందిన బిలాల్ అహ్మద్ గురును నగరంలో అరెస్ట్ చేశారు.
ముస్లిం ముజాహిదీన్
1995లో నగరంలో పేలుళ్లకు కుట్రపన్నిన అక్బర్ ఆలీ గ్యాంగులోని పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసి మూడుకిలోల ఆర్డీఎక్స్ను పట్టుకున్నారు.
లష్కరే తాయిబా
1998 జూలై 7వ తేదీన గణపతి నవరాత్రి ఊరేగింపులో పేలుళ్లకు కుట్రపన్నారు. కాశ్మీర్ నుంచి పోలీసులకు సమాచారం రావడంతో లష్కరే తాయిబా దక్షిణ భారత రెసిడెండ్ ఏజెంట్ సలీమ్ జునాయిద్తో పాటు అబూ ఫారిఖ్, అబ్దుల్ ఖఫా, మరో 13 మందిని అరెస్ట్ చేశారు. జునాయిద్కు లాడెన్తో సంబంధాలుండేవి. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నప్పుడు వీరివద్ద 22 కిలోల ఆర్డీఎక్స్, ఐదు చైనీస్ పిస్టల్స్, రిమోట్ టైమ్బాంబర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇండియన్ ముసల్మీన్ మహ్మదీ ముజాహిదీన్
ఈ సంస్థ లష్కరే తాయిబాకు అనుబంధంగా పనిచేసింది. దీనికి ఆజాం ఘోరీ ముఖ్యనాయకుడు. 1999లో హైదరాబాద్, మహారాష్ట్రలో పేలుళ్లకు సూత్రధారి. సైదాబాద్లో ఆర్ఎస్ఎస్ నాయకుడు మ హావీర్ ప్రసాద్, జ్యూయలరీషాపు యజమానిని కాల్చి చంపారు.
దీన్దార్ అంజుమన్
పాకిస్థాన్ సహకారంతో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నింది. 20మందికి శిక్షణ ఇప్పించి 1999లో హైదరాబాద్, కర్ణాటకలలో బాంబు పేలుళ్లు జరిపింది.
హిజ్బుల్ ముజాహిదీన్
2001లో ఈ సంస్థకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ షా అనే కాశ్మీరీ విద్యార్థి హైదరాబాద్లో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్రపన్ని దొరికిపోయాడు. అల్తాఫ్ పేలుడు పదార్థాలను స్వయంగా తయారు చేసేవాడు.
అబ్దుల్ అజీజ్ గ్యాంగ్
ఈ గ్యాంగుకు చెందిన అస్రా సింగ్ను 2001లో పేలుళ్లకుట్రలో అరెస్ట్ చేశారు. సౌదీ వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్కు చేరుకుని ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు.
అల్ ఉమా
హైదరాబాద్తో పాటు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల నిందితుల్లో కొందరిని 1998లో రాజమండ్రిలోను, 2001లో పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు.
సిమి
ఇది ఇప్పటికీ నగరంలో పనిచేస్తోంది. దీని కార్యకలాపాలు 2001లో బయటపడ్డాయి. పాకిస్థాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు నగరాన్ని అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ అనంతగిరి కొండల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఇందులో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇండియన్ ముజాహిదీన్
2007లో దీని అడుగుజాడలు నగరంలో బయటపడ్డాయి. నగరంలోని గోకుల్ చాట్తో పాటు లుంబినీ పార్కు వద్ద పేలుళ్లకు పాల్పడింది. ఈ సంఘటనలో 46 మంది చనిపోయారు. ఈ జంట పేలుళ్ల సమయంలోనే ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు దిల్సుఖ్నగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద బాంబును అమర్చారు. పోలీసులు దీన్ని ముందే గుర్తించి నిర్వీర్యం చేశారు. తాజాగా ఈ సంస్థే ఇక్కడి విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.