IPL 2026: రాజస్థాన్ ఓటమి.. ఫైనల్కు గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా ఏక పక్షంగా సాగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి వికెట్కు 167 పరుగులు జోడించి రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు.
శతక్కొట్టిన గిల్..
215 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్(53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 104) సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ తలో వికెట్ తీసారు.

అంతకుమందు రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96) చెలరేగగా.. రవీంద్ర జడేజా(45 నాటౌట్), డోనవన్ ఫెరీరా(38 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కగిసో రబాడ, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడ తలో వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆదివారం జరిగే ఫైనల్లో ఆర్సీబీతో గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
బుడ్డోడి కష్టం బుగ్గిపాలు
ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ మ్యాచ్లో సహచర బ్యాటర్ల నుంచి వైభవ్కు ఆశించిన సహకారం లభించలేదు. వెనువెంటనే వికెట్లు కోల్పోయినా.. వైభవ్ తన విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఈ బేబీ బాస్.. మరో 15 బంతుల్లోనే 96 పరుగులకు చేరుకున్నాడు. కానీ రబాడ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగి మరోసారి 4 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. వైభవ్ కాసేపు క్రీజులో ఉన్నా.. పవర్ ప్లేలో సరైన సహకారం లభించినా ఫలితం మరోలా ఉండేది.












Click it and Unblock the Notifications