CBSE విద్యార్థులకు అలర్ట్: జూన్ 1 నుంచి సరికొత్త పోర్టల్!
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల తదుపరి ప్రక్రియలైన మార్కుల వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇదొక ముఖ్యమైన అప్డేట్. వాస్తవానికి మే 29 చే ప్రారంభం కావాల్సిన ఆన్లైన్ దరఖాస్తుల పోర్టల్ను సీబీఎస్ఈ బోర్డు జూన్ 1, 2026కి వాయిదా వేసింది. అప్లికేషన్ ప్రాసెస్ సమయంలో వెబ్సైట్ సర్వర్లు డౌన్ అవ్వడం, విద్యార్థులు సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి ఫిర్యాదులు రావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
గడిచిన కొద్ది రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పోర్టల్ పనితీరుపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్కాన్ చేసిన జవాబు పత్రాలను (Answer Sheets) డౌన్లోడ్ చేసుకోవడంలో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి తోడు, ఫీజు చెల్లించే సమయంలో 'పేమెంట్ గేట్వే' ఎర్రర్లు రావడం, వెబ్సైట్లో తప్పుడు ఫీజు వివరాలు ప్రదర్శితమవడం వంటి సమస్యలు ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల వచ్చే సర్వర్ రద్దీని తట్టుకునేలా వెబ్సైట్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకే ఈ మూడు రోజుల సమయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు వివరించారు.

కొత్త 'ఆన్ స్క్రీన్ మార్కింగ్' విధానంపై వివాదం
ఈ ఏడాది 12వ తరగతి పేపర్ల మూల్యాంకనం కోసం సీబీఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్ స్క్రీన్ మార్కింగ్' (OSM) డిజిటల్ వ్యవస్థ తీవ్ర వివాదానికి దారితీసింది. డిజిటల్ కరెక్షన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, దీనివల్ల విద్యార్థుల మార్కుల్లో తేడాలు వచ్చాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా స్పందిస్తూ.. డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. త్వరలోనే వీటిపై సరిదిద్దే చర్యలు (Corrective Measures) తీసుకుంటామని, ఏ ఒక్క విద్యార్థికి అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.
4 లక్షలకు పైగా దరఖాస్తులు.. జూన్ 1 నుండి లైవ్!
ఈసారి మార్కుల వెరిఫికేషన్, జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఇప్పటికే రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని నివేదికలు చెబుతున్నాయి. జూన్ 1న పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులు తమ స్కాన్ చేసిన పేపర్లను జాగ్రత్తగా సమీక్షించుకోవచ్చు. అందులో టోటలింగ్ తప్పులు ఉన్నా, దిద్దకుండా వదిలేసిన (Unchecked) సమాధానాలు ఉన్నా, లేదా మార్కులు తక్కువ వేశారని భావించినా.. నిర్దిష్ట ప్రశ్నల రీ-ఎవాల్యుయేషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
టెన్షన్ వద్దు.. ఈ నంబర్లకు ఫోన్ చేయండి!
మార్కులు తగ్గాయని విద్యార్థులు ఎవరూ భయాందోళనలకు లేదా మానసిక ఒత్తిడికి గురికావద్దని సీబీఎస్ఈ బోర్డు సూచించింది. వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలున్నా, సమస్యలు ఎదురైనా విద్యార్థులు నేరుగా తమ అధికారిక సపోర్ట్ ఛానెల్స్ను సంప్రదించవచ్చని తెలిపింది.
- టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్: 1800 11 8004 (సీబీఎస్ఈ టెలి-కౌన్సెలింగ్)
- అధికారిక ఈమెయిల్ ఐడీ: [email protected]














Click it and Unblock the Notifications