SIR: ఒక్క ఓటు డిలీట్ అయినా ఊరుకోను! సీఎం సీరియస్ వార్నింగ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ వల్ల లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల నుంచి ఉపాధి కోసం చాలా మంది వలస పోయారని.. సరైన నిఘా లేకపోతే ఎస్ఐఆర్ సాకుతో ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యలపై నాయకులంతా సంపూర్ణ అవగాహన పెంచుకుని తగిన పరిష్కార మార్గాలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ను సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. "గతంలో బూత్ ఎన్ రోలర్ల సాయంతో కేవలం 90 రోజుల్లోనే 45 లక్షల డిజిటల్ మెంబర్షిప్లు చేయించాం. నాడు అత్యధిక సత్వాలు నమోదు చేయించిన వారికి ఏకంగా అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా సన్మానం కూడా చేయించాం. నాటి డిజిటల్ మెంబర్షిప్లో కీలక పాత్ర పోషించిన ఆ ఎన్ రోలర్ల సేవలను, అనుభవాన్ని ఇప్పుడు ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా వెరిఫికేషన్) ప్రక్రియలోనూ పూర్తిగా ఉపయోగించుకోవాలి" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిజిటల్ మెంబర్షిప్ కోసం గతంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ను నియమించి ఎలాగైతే నిరంతరం పర్యవేక్షించామో.. అదే వ్యూహాన్ని ఇప్పుడూ అమలు చేయాలన్నారు.

119 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లు.. క్షేత్రస్థాయిలోనే ఉండాలి!
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎస్ఐఆర్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఇన్ఛార్జ్లను తక్షణమే నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్లుగా నియమితులైన వారు తప్పనిసరిగా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉంటూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్లు కరెక్ట్గా క్షేత్రస్థాయిలో పని చేస్తే.. పేదలు, వలస వెళ్లిన వారి ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా వలస కార్మికులు ఊళ్లలో లేకపోయినా వారి ఓట్లు తొలగించబడకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
మంత్రులకు కఠిన ఆదేశాలు.. నేనే స్వయంగా ఇస్తా!
పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందేనని, ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చిచెప్పారు. "ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలి. నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలి. నేను కూడా ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తాను. నెలలో మూడు రోజులను పూర్తిగా పార్టీ క్యాడర్ కోసమే కేటాయిస్తా" అని ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు.. ఇలా పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనాల్సిందేనని, నాతో సహా ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని ఉద్ఘాటించారు.
సమిష్టి సమన్వయంతోనే విజయం.. పాత నేతల సలహాలు తప్పనిసరి!
పార్టీలో ఇప్పటికే దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ తరపున వేలాది మంది సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని సీఎం తెలిపారు. పార్టీ సీనియర్లు, మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలను తప్పకుండా తీసుకోవాలని సూచించారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తేనే.. కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చి వారు బూత్ స్థాయికి వెళ్తారని పేర్కొన్నారు. నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
హైదరాబాద్ పరిధిలోని 15 స్థానాలపై ప్రత్యేక ఫోకస్!
హైదరాబాద్ నగర పరిధిలో ఓట్ల వెరిఫికేషన్పై ప్రత్యేక వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అసెంబ్లీల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని.. ఈ బాధ్యతను రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని స్పష్టం చేశారు. అలాగే మహిళా ఓటర్ల నమోదు, రక్షణపై మహిళా కాంగ్రెస్ తరపున రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.














Click it and Unblock the Notifications