వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీతో బహిరంగంగా పొత్తు కొనసాగిస్తూనే, తెలంగాణలో కాంగ్రెస్తో తెరవెనుక మంతనాలు జరపడం చంద్రబాబు నాయుడు అసలు అజెండా అని విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం టీడీపీ-కాంగ్రెస్ మధ్య లోపాయికారి సంబంధాలకు స్పష్టమైన రుజువని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వ్యతిరేకత పునాదులపై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని నిత్యం వల్లివేసే చంద్రబాబు, ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులతో రాజకీయ లబ్ధి కోసం చేతులు కలపడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. బయట బీజేపీ, లోపల కాంగ్రెస్.. అనే ద్వంద్వ వైఖరితో చంద్రబాబు హైబ్రిడ్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు దేశ ప్రజలనే నివ్వెరపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బయటకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, మనసులో మాత్రం కాంగ్రెస్తోనే ఉంటారని ఆరోపించారు. మోసం ముసుగులో రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని అంబటి అన్నారు.
బహిరంగంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నట్టు కనిపించినా, తెరవెనుక కాంగ్రెస్తో హాట్లైన్ సంబంధాలు కొనసాగిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఉదంతం అంతా కూడా చంద్రబాబు వ్యూహమేనని, తన రాజకీయ అవసరాల కోసం బీజేపీని వాడుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ద్వారా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం, టీడీపీ జెండాలతో స్వాగతం పలికించడం వారి అనుబంధాన్ని బయటపెట్టిందని ఆయన అన్నారు.
చంద్రబాబు తెరవెనుక కాంగ్రెస్తో నిరంతరం హాట్లైన్లో మాట్లాడుతూనే ఉంటారని పునరుద్ఘాటించారు. ఏపీలో కాంగ్రెస్కు చంద్రబాబు బీ-టీమ్గా పనిచేస్తుంటే, తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్కు బీ-టీమ్గా మారిందని ఆయన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ అంటే చంద్రబాబుకు తప్ప మిగిలిన అందరికీ గౌరవమేనని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకుంటూ అనైతిక రాజకీయాలు చేయడం చంద్రబాబు ప్రత్యేకత అని ఆయన విమర్శించారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా జూన్ 4వ తేదీ నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోన్నామని అంబటి రాంబాబు అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని, దీన్ని డైవర్ట్ చేయడానికి సిట్ పేరుతో హడావిడి చేయడం, నోటీసులు ఇవ్వడం, విచారణల పేరుతో వేధించడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications