సెంటిమెంట్ దాటి: బాబు యాత్రపై హ్యాపీ, వారి తోడుతో..
చంద్రబాబు 150 రోజులుగా చేస్తున్న పాదయాత్ర చూపుతున్న ప్రభావంపై ప్రజల్లో బాగా ఉందని పార్టీ భావిస్తోంది. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే తర్వాత పరిస్థితి చాలా మెరుగైందని, పార్టీ వాణి ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి పాదయాత్ర ఒక బలమైన సాధనంగా ఉపయోగపడిందన్న అంచనాలో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. వంద రోజులతో ఆయన పాదయాత్ర ఆపేస్తే బాగుండేదన్న పార్టీ సీనియర్లు కూడా ఇప్పుడు కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు.
గతేడాది అక్టోబర్ 2న మొదలుపెట్టి చంద్రబాబు ఇప్పటిదాకా రాయలసీమలోని రెండు జిల్లాలు, తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, కోస్తాలో రెండు జిల్లాల్లో పర్యటించారు. ఆయన పాదయాత్ర మొదలు పెట్టిన వంద రోజుల తర్వాత వచ్చిన సహకార ఎన్నికల్లో ఐదారు జిల్లాల్లో పార్టీ మంచి పనితీరు కనపర్చింది. రెండు జిల్లాల బ్యాంకులను కైవసం చేసుకొంది.
బాబు పాదయాత్ర పార్టీలో కొత్త ఊపు తీసుకు వచ్చిందని నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా ఉంటే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు. బాబుకు తోడు బాలకృష్ణ, నారా లోకేష్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు జాయిన్ అవుతుండటంతో ఇక తిరుగులేదని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సాధ్యమైనంత వరకు దీనిని సాగదీసి ప్రజల్లోకి పార్టీని మరింత బలంగా తీసుకు వెళ్లాలని చూస్తున్నారు. దాదాపు ఈ ఏడాదంతా ఆయన ప్రజల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.